రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై హత్య కేసు నమోదు చేయాలి

రాహుల్ గాంధీ మెప్పుకోసమే బిసి జనాభాను తగ్గించారు
సూర్యాపేట నుంచి బీసీల ఉద్యమాన్ని మొదలు పెడతాం
రాజ్యాంగబద్ధంగా మా వాటాను మేము సాధించుకుంటాం
సూర్యాపేట ప్రతినిధి :- రాహుల్ గాంధీ మెప్పుకోసం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కులగనన చేసి బిసి జనాభాను తగ్గించి రాష్ట్రంలో 40 లక్షల మంది బీసీలను హత్య చేసిందని రాష్ట్ర ప్రభుత్వంపై హత్యా కేసు నమోదు చేయాలని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, మున్నూరు కాపు సంఘం నాయకులు పుట్ట కిషోర్ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పద్మశాలి భవన్ లో మున్నూరు కాపు సీనియర్ నాయకులతో పాటు బీసీ సంఘాల నాయకులతో కలసి శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2011లో నిర్వహించిన సమగ్ర కులగనన సర్వేలో మున్నూరు కాపులు 25 లక్షల మంది ఉంటే ప్రస్తుతం 13 లక్షల మందిని చూపించడం అన్యాయం అన్నారు. మున్నూరు కాపులు రాజకీయంగా సామాజికంగా ఎదుగుతున్నారని చట్టసభల్లో సీట్లు అడుగుతారని బిసి కులాలను తగ్గించి చెప్పడం దుర్మార్గమన్నారు. మూడు శాతం ఉన్న ఓసీలను 10 శాతానికి పెంచిన ఈ సమగ్ర కులగనన సర్వే తప్పుల తడక అన్నారు. త్వరలోనే బీసీలు బీసీ ఉపకులాలు అంత కలసి జేఏసీగా ఏర్పడి బీసీల వాటర్ పై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. రాహుల్ గాంధీ మెప్పు కోసం తప్పులతడకగా కులగనన చేశారు తప్ప బీసీలపై ప్రేమతో కాదన్నారు. బీసీల జనాభాను తగ్గించామని ఈ సర్వే తప్పని ప్రభుత్వం ఒప్పుకొని మళ్ళీ సర్వేను చేయాలన్నారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో సూర్యాపేట నుంచే బీసీల ఉద్యమాన్ని మొదలుపెట్టి రాజ్యాంగబద్ధంగా మా వాటాను మేము సాధించుకుంటామన్నారు. కొందరు బీసీ నాయకులు ముఖ్యమంత్రి అడుగులకు మడుగులు వత్తుతూ బీసీలకు అన్యాయం జరుగుతున్న ప్రశ్నించడం లేదన్నారు. మున్నూరు కాపుల సభ్యత్వాలే 18 లక్షలు ఉంటే 13 లక్షల 60వేల జనాభా ఎలా ఉంటారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. మా మున్నూరు కాపు కులగనన మేమే చేపట్టి వెబ్సైట్లో పెడతామని అలాగే ఇతర కులాలు కూడా తమ కులగనన చేపట్టి వెబ్సైట్లో పెట్టి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నారు. ప్రభుత్వం మన మాట వినే పరిస్థితిలో లేదు కాబట్టి బీసీలమంతా ఐక్యమై ప్రభుత్వం మెడలో వంచి మనకు దక్కాల్సిన వాటాను దక్కించుకునేందుకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మున్నూరు కాపు సంఘం సీనియర్ నాయకులు నల్లగుంట్ల అయోధ్య, డేగల జనార్ధన్, దంతాల రాంబాబు, సముద్రాల మనోహర్, గోనె సందీప్, కడియం శ్రీను, గోనె సతీష్, దంతాల వెంకటేశ్వర్లు, గోనే అశోక్, దంతాల కొండల్ తదితరులు ఉన్నారు.