బీసీ స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి
ప్రభుత్వం స్పందించకపోతే ఐదు లక్షల మంది విద్యార్థులతో రాష్ట్రవ్యాప్త ఉద్యమం
బీసీ విద్యార్థి సంఘంజిల్లా అధ్యక్షులు పోలోజు మహేష్ చారి.
సూర్యాపేట : బీసీ విద్యార్థులకు పెండింగ్లో ఉన్న రూ.8,500 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పోలోజు మహేష్ చారి డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ర్యాగ అరుణ్ కుమార్ పిలుపు మేరకు మంగళవారం సూర్యాపేటలో చేపట్టిన కళాశాలల బంద్ ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భంగా మహేష్ చారి మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ నుంచి ఉన్నత విద్య వరకు చదువుతున్న ప్రతి అర్హత ఉన్న విద్యార్థికి స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ను ఎలాంటి జాప్యం లేకుండా అందించాలని కోరారు. బకాయిలు విడుదల కాకపోవడంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ప్రభుత్వ, ఇంజినీరింగ్, ఫార్మసీ, ప్రైవేటు జూనియర్, డిగ్రీ కళాశాలల బంద్ను రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉద్ధృతం చేయడంతో పాటు ఐదు లక్షల మంది విద్యార్థులతో తమ సంగం ఆధ్వర్యంలో భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మడిపల్లి సాయి తేజ, కల్లూరు అభి, రిషి, జయచంద్ర తదితరులు పాల్గొన్నారు.