ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేయాలి
మండల స్థాయిలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక మండల సభ
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్
ప్రజల సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. 99 రోజుల ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం మునగాల మండల కేంద్రంలోని రైతు వేదిక లో ఏర్పాటు చేసిన మండల సభలో జిల్లా ఎస్పీ నరసింహ తో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను అధికారులు గుర్తించి తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. గ్రామ సభలలో ప్రజా సమస్యలపై అందరూ సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి, సంక్షేమం అందరికి చేరడమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. గ్రామ, మండల వ్యవస్థ బలోపేతం ఆయ్యి వేగవంతంగా సేవలు అందించాలని తెలిపారు. సమస్య లేని గ్రామాలు ఉండవని, సమస్యను గుర్తించి సత్వరమే సమస్యకు పరిష్కారం ఏ విధంగా జరుగుతుందో ఆలోచన చేసి వెంటనే పరిష్కరించాలని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అర్హులైన అందరికి చేరాలని, చాలా మందికి ప్రభుత్వ పథకాలపై అవగాహన లేదని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ప్రభుత్వ పధకం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పేద విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.200కోట్లతో యాంగ్ ఇండియా స్కూళ్లను నిర్మిస్తుందన్నారు. అనంతరం వివిధ శాఖల అధికారులు వారి పరిధిలో అమలవుతున్న సంక్షేమ పథకాల అమలు తీరును కలెక్టర్ వివరించారు.
మహాలక్ష్మి, గృహ జ్యోతి రైతు రుణ మాఫీ, రైతు బీమా, ఇందిరమ్మ ఇళ్లు, స్వయం సహాయక సభ్యులకు మంజూరైన వడ్డీ లేని రుణాల వివరాలు, కొత్త రేషన్ కార్డులు, పాస్ బుక్కులు, సన్న బియ్యం పంపిణీ, వైద్య సేవలు, తదితర పథకాలకు సంబంధించి లబ్ధిదారుల పూర్తి వివరాలను మండల ప్రజలకు తెలియజేశారు. అదే విధంగా ఇటీవల నూతనంగా ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి అల్పాహారం పథకం, ఇందిరమ్మ జీవిత కుటుంబ బీమా, మధ్యాహ్న భోజన పథకం - ఇంటర్మీడియట్, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. వివిధ పథకాల లబ్ధిదారులు తమకు అందిన ప్రయోజనాలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రోడ్లపై తల్లిదండ్రులు ఆజాగ్రత్తగా ఉండడం వల్ల చాలా మంది పిల్లలు రోడ్డు ప్రమాదాలకు గురయ్యారని తెలిపారు. రోడ్డు నియమాల గురించి రోడ్లపై పాటించాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థులు ఇంట్లో తల్లిదండ్రులకు తెలియజేయాలని హెల్మెట్ వాడడం సిట్ బెల్ట్ ధరించడం గురించి వివరించాలని అన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపకూడదు అనే విషయం గురించి తల్లిదండ్రులకు లేఖల ద్వారా తెలియజేయాలని సూచించారు. ప్రయాణ సమయంలో హెల్మెట్ ధరిస్తామని సీట్ బెల్ట్ పెట్టుకుంటామని మద్యం తాగి వాహనాలు నడపమని తల్లిదండ్రుల నుండి పిల్లలు ప్రామిస్ తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేయించి కరపత్రాలు అందించారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి డి.శిరీష, తహసిల్దార్ సరిత ఎంపీడీవో రమేష్ సర్పంచ్ ప్రమీల ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది, మండల ప్రజలు పాల్గొన్నారు.
-------------------------------------
జిల్లా పౌర సంబంధాల అధికారి సూర్యాపేట వారిచే జారీ చేయనైనది.