పద్మ పురస్కాలకు అర్హులైన వ్యక్తుల నుండి నామినేషన్ల ఆహ్వానం: జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జోగులాంబ గద్వాల 3 జూలై 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రదానం వేసే పద్మ అవార్డులు- 2027 ( పద్మ విభూషణ్,పద్మ భూషణ్, పద్మ శ్రీ) అర్హులైన వారి నుండి నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశానికి, సమాజానికి విశిష్ట సేవలు అందించిన అసాధారణ ప్రతిభావంతులను పద్మ అవార్డులకు సిఫారసు చేయాలని భారత ప్రభుత్వం కోరుతున్నట్లు తెలిపారు. గుర్తింపు పొందని ప్రతిభావంతులు, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో సేవలందిస్తున్న వారు, మహిళా సాధికారత, బాలల సంక్షేమం, సామాజిక సేవ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. అదే విధంగా కళలు,సాహిత్యం,విద్య,క్రీడలు, వైద్యం, సామాజిక సేవ,సైన్స్, ఇంజినీరింగ్, పబ్లిక్ అఫైర్స్, సివిల్ సర్వీస్, వాణిజ్యం, పరిశ్రమలు మొదలైన రంగాల్లో విశిష్ట సేవలు అందించి విజయాలు సాధించిన వారికి ఈ అవార్డులు అందజేయనున్నట్లు వెల్లడించారు. 2027 సంవత్సరానికి ఇచ్చే ఈ పద్మ అవార్డుల కోసం నామినేషన్లు/సిఫార్సులను రాష్ట్రపతి పురస్కార్ పోర్టల్ https://awards.gov.in ద్వారా స్వీకరించబడతాయని వెల్లడించారు. నామినేషన్లను 15 జూలై,2026 లోగా పైన పేర్కొన్న పోర్టల్లో అందుబాటులో ఉన్న ఫార్మాట్లో, పూర్తి వివరాలతో పాటు విశిష్ట సేవలు,సామాజిక సేవలు వివరణాత్మక కథనం రూపంలో పంపించాలని తెలిపారు.ఆన్లైన్లో నామినేషన్లు పంపడానికి అవసరమైన సూచనలు https://awards.gov.in పోర్టల్లో అందుబాటులో ఉన్నాయని, అలాగే నియమ నిబంధనలు పద్మ అవార్డుల వెబ్సైట్: https://padmaawards.gov.in లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. జిల్లాకు చెందిన అర్హులైన వ్యక్తులు లేదా వారి పేర్లను సిఫారసు చేయదలచిన వారు, పూర్తి వివరాలతో కూడిన ప్రతిపాదనలను 2026 జూలై 15లోగా జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయానికి సమర్పించాలని కలెక్టర్ తెలిపారు.