కజిరంగ నేషనల్ పార్కులో ఏనుగు సఫారీ చేసిన ప్రధాని మోడీ

అసోం:-ప్రధాని నరేంద్ర మోడీ అసోం పర్యటనలో ఉన్నారు. రెండ్రోజుల పర్యటన కోసం అసోంలోని తేజ్ పూర్ ఎయిర్ పోర్టుకు వెళ్లి.. అక్కడ్నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో కజిరంగకు వచ్చారు. కజిరంగ నేషనల్ పార్కులోనే నైట్ స్టే చేశారు. ఉదయాన్నే పార్కులోని సెంట్రల్ కొహోరా రేంజ్ ను సందర్శించారు. ఏనుగు ఎక్కి సఫారీ చేశారు మోడీ. సఫారీ అనంతరం ఏనుగులకు చెరకు గడలను తినిపించారు.
ఆ తర్వాత జీపు సఫారీ చేశారు. ఏనుగులకు చెరకు తినిపించిన ఫొటోలను సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పంచుకున్నారు మోడీ. అందరూ కజిరంగ నేషనల్ పార్క్ను సందర్శించి ఇక్కడి ప్రకృతి అందాలను వీక్షించాలని కోరారు. మోడీ వెంట పార్క్ డైరెక్టర్ సొనాలీ ఘోష్, అటవీశాఖ సీనియర్ అధికారులున్నారు. మహిళా ఫారెస్ట్ గార్డ్లతోనూ ప్రధాని ముచ్చటించారు.
కజిరంగ ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందిన పార్కు. 1957 తర్వాత ఈ పార్క్ను సందర్శించిన తొలి ప్రధాని ఈయనే కావడం విశేషం. కజిరంగ నేషనల్ పార్కు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగాను గుర్తింపు పొందింది.