ఐజ.బుడగ జంగాల కాలనీలో పోలియో కేంద్రం పరిశీలన జిల్లా వైద్య అధికారిణి
జోగులాంబ గద్వాల 30 జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి (డీఎంఅండ్హెచ్ఓ) డాక్టర్ సంధ్యా కిరణ్మయి మంగళవారం అయిజ మండల కేంద్రంలో విస్తృతంగా పర్యటించారు. అయిజ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) పరిధిలోని అత్యంత సమస్యాత్మక (హైరిస్క్) ప్రాంతమైన బుడగ జంగాల కాలనీని ఆమె స్వయంగా సందర్శించి, క్షేత్రస్థాయిలో పోలియో చుక్కల పంపిణీ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీలోని చిన్నారుల తల్లిదండ్రులను, ఆరోగ్య సిబ్బందిని కలిసి మాట్లాడారు. ఐదేళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కల మందు సక్రమంగా వేశారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. చుక్కల మందు వేసిన అనంతరం చిన్నారుల చేతి వేలికి తప్పనిసరిగా సిరా గుర్తు (మార్కు) వేస్తున్నారా అని సిబ్బందిని అడిగారు. స్థానికంగా ఒక్క బిడ్డ కూడా పోలియో చుక్కలు వేయించుకోకుండా విడిచిపోకూడదని, వలస కార్మికులు పూరి గుడిసెల ప్రాంతాల్లో నివసించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో అయిజ వైద్య అధికారులు డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ రామలింగారెడ్డి, ఆరోగ్య విస్తరణ అధికారి (ఎంపీహెచ్ఈఓ) ఓబులేష్, వైద్యాధికారి శివతేజ, ఆశా కార్యకర్త నాగబాల ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.