ఫణిగిరి బౌద్ధ క్షేత్రం అభివృద్ధికి 5 కోట్లు మంజూరు
తిరుమలగిరి 23 జూన్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
ఫణిగిరి, గాజులబండ బౌద్ధ కట్టడాల పరిరక్షణ పనులకు మంత్రి జూపల్లి శంకుస్థాపన
: తెలంగాణలోని ప్రాచీన బౌద్ధ వారసత్వ సంపద పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి, గాజులబండ బౌద్ధ క్షేత్రాల్లో పరిరక్షణ, పునరుద్ధరణ పనులకు ఎమ్మెల్యే మందుల సామేల్ తో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం శంకుస్థాపన చేశారు. తెలంగాణ జెన్కో (వైటీపీఎస్) సీఎస్ఆర్ నిధులతో ఫణిగిరి బౌద్ధ కట్టడాల పరిరక్షణకు రూ.1.60 కోట్లు, గాజులబండ కట్టడాల సంరక్షణకు రూ.23 లక్షలు వెచ్చించనున్నారు.
ఫణిగిరి దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన బౌద్ధ వారసత్వ కేంద్రాల్లో ఒకటని మంత్రి పేర్కొన్నారు. బౌద్ధ ధర్మం శాంతి, అహింస, మానవతా విలువలకు ప్రతీకగా నిలిచిందని, అలాంటి చారిత్రక వారసత్వాన్ని భావితరాలకు అందించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక, పురావస్తు, వారసత్వ సంపద పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు.
బౌద్ధ పర్యాటక పటంలో తెలంగాణకు మరింత గుర్తింపు
ఫణిగిరి, గాజులబండ వంటి బౌద్ధ క్షేత్రాల అభివృద్ధి ద్వారా తెలంగాణను జాతీయ, అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక పటంలో మరింత ప్రముఖంగా నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. తవ్వకాలలో వెలుగులోకి వచ్చిన శిల్పాలు, శాసనాలు, నాణేలు తెలంగాణ చరిత్ర వైభవాన్ని ప్రపంచానికి చాటుతున్నాయని అన్నారు. పర్యాటకుల రాక పెరగడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు, గ్రామీణ ఆర్థికాభివృద్ధికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే సామేల్ విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి జూపల్లి కృష్ణారావు.. ఫణిగిరి బౌద్ధ క్షేత్ర సమగ్ర అభివృద్ధికి రూ.5 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిధులతో ప్రధాన రహదారి నుంచి క్షేత్రానికి చేరుకునే అప్రోచ్ రోడ్డు అభివృద్ధి, కొండపైకి వెళ్లే
మెట్లదారి నిర్మాణం, పర్యాటక మౌలిక సదుపాయాల కల్పన, సందర్శకుల వసతుల మెరుగుదల చేపట్టనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ, పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున రావు, డిప్యూటీ డైరెక్టర్లు పగడం నాగరాజు, నర్సింగ్ నాయక్, ఓఎస్డీ రాజు, అసిస్టెంట్ డైరెక్టర్లు నాగలక్ష్మి, మల్లు నాయక్, ఫణిగిరి, గాజులబండ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.