పోలీసులకు తీపి కబురు.. 25 మందికి ఎస్ఐలుగా పదోన్నతులు
జోన్-4 భద్రాద్రి పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు పదోన్నతుల పండగ వచ్చింది, ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రమోషన్ల ప్రక్రియకు ఎట్టకేలకు మోక్షం లభించింది. హెడ్ కానిస్టేబుళ్లు, అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్లుగా (ఏఎస్ఐ) పనిచేస్తున్న మొత్తం 25 మందికి సబ్-ఇన్స్పెక్టర్లుగా (ఎస్ఐ-సివిల్) పదోన్నతులు కల్పిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్, భద్రాద్రి జోన్-4 ఇన్చార్జి డీఐజీ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 30 శాతం కోటా కింద తాత్కాలిక ప్రాతిపదికన ఈ ప్రమోషన్లు కేటాయించారు. వరంగల్, మహబూబాబాద్ జిల్లాలతో పాటు ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న వీరికి వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం తదితర ప్రాంతాలకు పోస్టింగులు ఇచ్చారు. పదోన్నతులు పొందిన వారంతా ఉత్తర్వులు అందిన 15 రోజుల్లోగా కొత్త స్థానాల్లో విధుల్లో చేరాల్సి ఉంటుంది, ఒకవేళ గడువులోగా రిపోర్ట్ చేయకపోతే ప్రస్తుత ప్యానెల్ సంవత్సరానికి ఆ ప్రమోషన్ హక్కును పూర్తిగా కోల్పోతారని ఉన్నతాధికారులు ఆ ఉత్తర్వుల్లో కచ్చితంగా స్పష్టం చేశారు.