పైసా ఖర్చు లేకుండా వైద్యం కావాలి సంపాదనంతా రోగాలకే పెడితే సర్కార్ ఉండేందుకు
పైసా ఖర్చు లేకుండా వైద్యం కావాలి* సంపాదనంతా రోగాలకే పెడితే సర్కార్ ఉండేందుకు* సంపన్నులు ఎక్కడైనా చూపించుకుంటారు పేదలకే పెద్ద సమస్య.* అన్ని హంగులతో ప్రభుత్వ వైద్యశాలల్లో నాణ్యమైన ఉచిత వైద్యం అందించే సర్కారు కావాలి*.
ప్రజల ఈ కనీస కోర్కెను తీర్చని పాలకులెందుకు.?
వడ్డేపల్లి మల్లేశం
16...01....2025
75 గణతంత్ర దినోత్సవాలను జరుపుకున్న భారతదేశంలో రాజ్యాంగంలో అనేక అవకాశాలను హక్కులు బాధ్యతలు విధులను పేర్కొన్నప్పటికీ విజ్ఞానదాయకమైన సమాజాన్ని నెలకొల్పే క్రమంలో విద్య ప్రధానమైనది కాగా అంతే స్థాయిలో మానవ మనుగడను ప్రశ్నించకుండా ఆరోగ్యంగా ప్రకృతితో మమేకమై జీవించగలిగే వైద్య సౌకర్యాలను కల్పించాల్సిన పాలకులు మాత్రం ప్రైవేట్ రంగం పైన ఆధారపడి వాళ్ల దయాజాక్షిణ్యముతో బతకడం సిగ్గుచేటు. భారతదేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాజ్యాంగం హామీ ఇచ్చిన మేరకు ఉచిత నాణ్యమైన వైద్యాన్ని ప్రజలకు అందిస్తామని ఇప్పటికీ ఎక్కడా ప్రకటించలేదు. అంతేకాదు కనీసం ఎన్నికల మేనిఫెస్టోలలో కూడా ఏ రాజకీయ పార్టీ కూడా స్పష్టంగా పేర్కొనక పోవడం ఇది ఆయా రాజకీయ పార్టీల బాధ్యతారాహిత్యం కాదు ఒక కుట్రలో భాగమని అంగీకరించి తీరాలి. అయితే భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలలో ముఖ్యంగా ఢిల్లీ వంటి రాష్ట్రాలలో ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేసిన సందర్భాలను మనం గమనించవచ్చు. అంతెందుకు ప్రభుత్వ పాఠశాలల్లో వైద్య సిబ్బందిని నియమించి సిబ్బంది విద్యార్థుల యొక్క ఆరోగ్యాన్ని క్రమబద్ధీకరించే క్రమంలో కొన్ని చర్యలు తీసుకున్న విషయాన్ని అంగీకరించి తీరాలి.
కనీసం గానైనా కేంద్రం అన్ని రాష్ట్రాలైన ఢిల్లీ లాంటి ఆదర్శవంతంగా పనిచేస్తున్న పాలనను చూసిఅయినా నేర్చుకోవడం అవసరం. ఇదే సమయంలో ప్రజలు కూడా తమకు అవసరమైనటువంటి విద్యా వైద్యాన్ని పాలకుల నుండి డిమాండ్ చేయకపోవడం, ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీల ముందు నిలదీయకపోవడం, తాత్కాలిక ప్రయోజనాలకు డబ్బు ఇతర ఉచిత పథకాలకు మాత్రమే పరిమితమైపోయిన కారణంగా బాధ్యతలకు నిలబడుతున్నటువంటి ప్రజలు తమ హక్కుల కోసం మాత్రం పోరాటం చేయడం లేదంటే నిజంగా ఇది ఓటర్ల బలహీనత, రాజకీయ పార్టీల నుండి ఆ ఆశించే దుర్భలత్వం అని చెప్పక తప్పదు. అందుకే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు కూడా "ఉచిత విద్య వైద్యాన్ని పాలకులు రాజ్యాంగం ప్రకారంగా కల్పించి తీరాలి. కానీ విద్యతో జ్ఞానము వికసించి వైద్యంతో ఆరోగ్యం బలపడి ప్రజలు పాలకులను ప్రశ్నించే స్థాయికి చేరుకుంటారు పాలకులు ప్రజల ఎదుగుదలను సహించరు అందుకే ఉచిత విద్య వైద్యం కేవలం నేతి బీరకాయలోని నెయ్యి చందమే" అని ఏనాడో ప్రజలను చైతన్య0 చేయడం జరిగింది.కానీ ప్రజలే ఇప్పటికీ ఉచిత విద్య ఉచిత వైద్యం కోసం డిమాండ్ చేయకపోవడం బలహీనత గానే భావించాలి.
సామాన్య ప్రజలు -= ఉచిత వైద్యంకై ఆరాటం
**********----**
పోషకాహార లోపం, ఉత్పత్తి అవుతున్నటువంటి ఆహార పదార్థాలలో పోషక విలువలు లేకపోవడం, భూసారం సన్నగిల్లడం, కృత్రిమ ఎరువుల కారణంగా విషతుల్యమవుతున్నటువంటి ఆహారం, పర్యావరణ కాలుష్యం కారణాలు ఏమైతేనేమి రోగ నిరోధక శక్తి ప్రజలలో క్రమంగా తగ్గి రోగాల బారిన పడుతూ ఇంకా తప్పుడు అలవాట్లు ప్రభుత్వం అనుమతించినటువంటి మద్యం పొగాకు ఉత్పత్తులు సిగరెట్లు బీడీలు పాన్ అంబర్ ధూమపానం వంటి అలవాట్ల కారణంగా ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారు. మరొకవైపు ముఖ్యంగా మద్యపానం ధూమపానం కారణంగా క్యాన్సర్ కిడ్నీస్ లివర్ హార్ట్ ఇతర భయంకరమైన రోగాల బారిన పడుతూ ఉంటే అవసరమైనటువంటి చికిత్సను చేసుకోవడానికి పేద కుటుంబాలకు అవకాశం లేదు. ఈ దేశంలో పేరుకు కిమ్స్ నిమ్స్, ఏయిమ్స్ వంటి పేర్లతో దేశవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యశాలలు ఉన్నప్పటికీ అవి నామమాత్రంగానే మిగిలిపోవడం, భవనాల వరకు మాత్రమే అలంకారప్రాయంగా కనిపించడం, సిబ్బంది లేక యంత్రాలు కానరాక మందులకు దిక్కు లేక, పట్టించుకునే నాధుడు లేక ఆ వైద్యశాలలు వెలవెలబోతున్నాయి. " మా బతుకులకు తీర్చిదిద్దేది ఎవరు? మరొకవైపు ప్రైవేటు ఆసుపత్రులు ఆకాశాన్ని తాకే భవనాలలో అందంగా కనపడుతున్నాయి కానీ అందులోకి వెళ్లాలంటే మా దగ్గర డబ్బులు ఉండాలి కదా! అంతెందుకు ఇప్పటికీ అనేక రోగాలకు ఆయుర్వేదం, హోమియో, యునాని వంటి వైద్య చికిత్సలు అవసరం అంతేకాదు చాలా రోగాలు కూడా నయం కావడానికి ఫిజియోథెరపీ చాలా పని చేస్తుంది అని తెలుసు. అయినప్పటికీ నియోజకవర్గాలలో ఒక్కొక్క చోట జిల్లా కేంద్రాలలో కూడా అలాంటి కనీస సౌకర్యాలు లేకపోవడం, ఎమ్మారై స్కానింగ్ ఇతర ఖరీదు అయినటువంటి పరీక్షలు ఒకవేళ ఆసుపత్రులలో ఉన్నప్పటికి కూడా ప్రభుత్వ వైద్యశాలలో క్రింది డాక్టర్లు చేసిన సిఫారసులను ఆమోదించడం లేదు. అలాంటి పరీక్షలు ఉచితంగా చేయడం లేదు నా మాత్రపు కాగితమిచ్చి తిరిగి పంపించిన వైనా న్ని మనం గమనించవచ్చు. అందుకే ఈ బాధలు పడలేక మేము ప్రైవేటు దావకానకు పోవలసి వస్తున్నది.అయితే ఏమి లాభం? మా సంపాదనలో సగానికి ఎక్కువ రోగాలకు పెడుతున్నాం ఒకరు కాకపోతే మరొకరికి ఏదో జబ్బు పడితే పనులు పక్కనపెట్టి అప్పులు తీసుకువచ్చి ప్రభుత్వ దావకాన మీద నమ్మకం లేక ప్రైవేటు దావకాండ్లకు పోతే అక్కడ చెప్పరాని దోపిడీ. పరీక్షల పేరుతో మందుల పేరుతో అవసరం లేని చికిత్సలను అంటగట్టి లక్షలు దండుకుంటున్నారు. ఇదంతా సర్కారు కండ్ల ముందటనే జరుగుతున్నది కదా! అయినా పట్టించుకోని సర్కారు మాకు అవసరమా? నాణ్యమైన మందులు అన్ని హంగులతో ఉచిత వైద్యాన్ని అందించగలిగే సర్కారు దావాఖానాలు మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కేంద్ర స్థాయి వరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా అందించగలిగే దవాఖాన్లు ఉన్నప్పుడే మాకు ఈ ప్రభుత్వం మీద విశ్వాసం. ఎందుకంటే 78 సంవత్సరాల లో మేము ఎంతో మోసపోయిన0, ఇంకా నమ్మడానికి సిద్ధంగా లే0, ఇకపైన ఓట్ల పేరుతో ప్రచారం పేరుతో నమ్మించే పద్ధతిలో ప్రలోభాలను అంటగడితే మాత్రం మేము సహించం.
మా డిమాండ్ ఒకటే నాణ్యమైన ఉచిత విద్యను అది ఎన్ని లక్షలు కోట్ల ఖర్చు అయినా ప్రభుత్వ ఆధ్వర్యంలో చేయగలిగితే దానిని మాత్రమే మేము అంగీకరిస్తాం అదే మా డిమాండ్ కూడా. "
ఆవేశాలకు ఆవేదనకు బాధలకు కష్టాలకు కన్నీళ్లకు ఆలవాలమైనటువంటి ఈ దేశంలో పేదలు అట్టడుగు వర్గాలు ఆదివాసీలు సామాన్య ప్రజలు మధ్యతరగతి వ్యక్తులు కూడా ప్రభుత్వ వైద్యరంగం పట్ల ప్రభుత్వ విధానాల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యం పట్ల దశాబ్దాల తరబడి విసిగి వేసారి పలికిన ఈ మాటలను ఇప్పటికైనా పాలకులు గ్రహిస్తే మంచిది. మోకాళ్ళ నొప్పులను లేదా ఇతర రకాల అనేక నొప్పులు తగ్గించడానికి మేము ప్రత్యేకంగా చికిత్సను రూపొందించినo అని కొన్ని సంస్థలు దేశవ్యాప్తంగా ఆవిర్భవించినాయి. లక్షల రూపాయలు దండుకుంటున్నారు కృత్రిమంగా గుజ్జు పెరిగిందని నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు కానీ చివరికి నిష్ప్రయోజనం మళ్ళీ తిరిగి మోకాలు నొస్తున్నాయి, కీళ్లవాతం అట్లాగే ఉంది, మెడ నరాలు గుంజుతున్నాయి, నడుము నొప్పి తగ్గడం లేదు అంటూ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోయి చెప్పుకోవాల్సిన అగత్యం ఈ దేశంలో అవసరమా? ప్రతి రాష్ట్రంలో ఇదే తంతు కొనసాగితే కేంద్ర ప్రభుత్వం కూడా వైద్య రంగానికి కనీసం ఒక్క శాతం మాత్రమే ఖర్చు పెడుతున్నట్లు నిర్ధారణ అవుతుంటే ఇక ప్రభుత్వ రంగంలో నాణ్యమైన విద్య ఏ పాటి మెరుగు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు .యుద్ధాలు కావాలి ఆయుధాలు కావాలి,మత ప్రచారం చేసుకోవాలి, పార్టీల ప్రచారం చేసుకోవాలి, ప్రభుత్వ ఖర్చుతో ఊరేగాలి, విమానాల్లో విహరించడం వరకే ప్రధానమంత్రి మంత్రులు ఇతర ముఖ్యమంత్రి కాలమంతా గడిచిపోతున్నది కానీ ప్రజల ఆరోగ్యాల గురించి పట్టించుకున్న దాఖలలేదు. వాళ్లు మాత్రం చిన్న చికిత్సకు ఇతర దేశాలకు పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్లి ఖరీదు వైద్యం పొందుతున్నారు మరి సామాన్య ప్రజలు అలాంటి వాళ్ళు కాదా? ప్రభుత్వ రంగంలో కొన్ని చికిత్సలు మాత్రమే నామమాత్రంగా కనిపిస్తాయి చాలా చికిత్సలకు అక్కడ అడ్రస్ ఉండదు. ఇక ప్రైవేటు వైద్యశాలలో అన్ని రకాల చికిత్సలు చేస్తామని పెద్ద పెద్ద ప్రకటనలతో బ్రతుకు మీద ధ్యాస కోసం విధి లేని పరిస్థితిలో ఆసరా లేని సందర్భంలో ప్రైవేటు వైద్యశాలలను నమ్ముకొని మా ఇండ్లనే అమ్ముకున్నాము. ఇంకానా ఇకపై సాగదు ఈ దోపిడీ ఆగాల్సిందే! దోపిడికి కారణమవుతున్న నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పాలకుల అంతు చూడాల్సిందే! అనే నిర్ణయానికి ప్రజలు వచ్చినట్లుగా మనకు అర్థమవుతున్నది.విద్య కూడా అదే స్థాయిలో లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్నది కదా! ఆరకొర జీవితాల ఆదాయం నుండి పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తుంటే ఆ కుటుంబాలలో జీవన ప్రమాణాలు ఎలా మెరుగవుతాయి? ఆల్ఫాదయ వర్గాలకు ఈ దేశంలో స్థానం లేదా? తోటి మనిషిని సాటి మనిషిగా చూసే సంస్కారం సామాజికంగా కొరవడితే పాలకులు కూడా సామాన్యుల పైన ఇంత కక్షగడితే ఎలా ?అని పేదలు సామాన్యులు ఆవేదన చెందుతున్నారు.
"ఆ ఈ ప్రజల ఆవేదనకు అర్థముంది, ప్రజల నిరాశలో రోషం ఉంది, నిర్వేదంలో నిలదీసే తత్వం ఉంది, కన్నీటిలో క్రౌర్యము ఉన్నది, వీటిని పాలకులు ఆలోచిస్తే మంచిది."
అల్లోపతి ఆయుర్వేదము హోమియో యునాని వంటి అన్ని రకాల వైద్య సౌకర్యాలు నియోజకవర్గస్థాయిలో పూర్తిహంగులతో ప్రభుత్వం నెలకొల్పి ఉచితంగా సమకూర్చాలి. ఎక్కడైనా అనుకోని పరిస్థితుల్లో ఆ సౌకర్యం లేకపోతే ప్రభుత్వమే ఉచితంగా ఏర్పాటు చేయాలి. పేదల నమ్మకాన్ని దీనస్థితిని ఆసరా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నటువంటి ప్రైవేటు వైద్యశాలల పైన నిఘా వేసి దృఢ హస్తముతో అణచివేయాలి. చిల్లి గవ్వ ఖర్చు లేకుండా ప్రజల కొనుగోలు శక్తిని పెంచి జీవన ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తెచ్చే విధంగా ప్రభుత్వాలు తమ వైద్య విధానాన్ని ముందుగా ప్రకటించాలి .దీనితోపాటు ఉచిత విద్యా వైద్యానికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి విధానాలను ప్రకటించినప్పుడు మాత్రమే ప్రజలు పాలకులను విశ్వసిస్తారు, గౌరవిస్తారు, ఆదరిస్తారు. లేకుంటే మోసగాళ్లని, నేరస్తులని,అవినీతిపరులని, ప్రైవేటు వ్యవస్థకు వంతపడే దోపిడీదారులని నిందిస్తారు. ఆ విమర్శకు పేదల ఆవేదనకు క్రౌర్ర్యానికి గురికాకముందే దేశవ్యాప్తంగా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉచిత విద్యను అందించి నాణ్యమైన స్థాయిలో బలోపేతం చేయడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను ఆరోగ్యాలను మరింత పెంచడానికి అవకాశం ఉంటుంది.
అప్పుడే "ప్రజలు ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగస్వాములు కావడానికి జాగరుకులైనటువంటి ప్రజల వల్ల ప్రజాస్వామ్యం వికసించడానికి అవకాశం ఉంటుంది. ప్రజాస్వామ్యం వికసించాలని ,ప్రజల భాగస్వామ్యం అవసరమని, ఆరోగ్యవంతమైన ప్రజలు కావాలని పాలకులకు అభిప్రాయం ఉంటే వెంటనే ఈ వైపుగా దృష్టి సారించాలి.ఉచితా లను ప్రలోభాలను వాగ్దానాలను పక్కన పెట్టి గాలికి ఉచిత విద్య వైద్యాన్ని చట్టబద్ధం చేయగలిగే దమ్ము ఈ దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నదని రుజువు చేయగలిగితే సంతోషం. లేకుంటే పేదవాడి కోపం పెదవికి చేటు కాదు కలవాడి పదవికి చేటు అనే సత్యం రుజువయ్యే కాలం ఎంతో దూరంలో లేదు."
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)