నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి
– ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తుతో బాధితులకు న్యాయం చేయాలి.
సి.సి.టి.ఎన్.ఎస్. (2.0)లో ప్రతి కేసును సకాలంలో నమోదు చేసి నిరంతరం అప్డేట్ చేయాలి.
రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక నేరాలు, సైబర్ మోసాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి.
మంత్లీ క్రైమ్ రివ్యూ సమావేశంలో సిబ్బందికి కీలక సూచనలు చేసిన జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు
జోగులాంబ గద్వాల 9జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :- జిల్లాలో నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూ, ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు నిర్వహించి బాధితులకు పూర్తి న్యాయం జరిగేలా చూడాలని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మంత్లీ క్రైమ్ రివ్యూ సమావేశంలో జిల్లా ఎస్పీ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పనితీరు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, నేరాల నియంత్రణ చర్యలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, నేరస్తులకు చట్టప్రకారం శిక్ష పడేలా పకడ్బందీగా దర్యాప్తు చేయాలని సూచించారు. బాధితులకు న్యాయం చేయడం పోలీసుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు.
అదేవిధంగా సి.సి.టి.ఎన్.ఎస్. (2.0) వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. ప్రతి కేసును సకాలంలో నమోదు చేసి, సంబంధిత వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం ద్వారా దర్యాప్తు మరింత వేగవంతం అవుతుందని తెలిపారు.
సి.సి.టి.ఎన్.ఎస్.లో అందుబాటులో ఉన్న అన్ని టూల్స్, ఫీచర్లను పూర్తిస్థాయిలో వినియోగించడం ద్వారా పారదర్శకత, సమాచార సమన్వయం, సేవల నాణ్యత మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక నేరాలు, ఆన్లైన్ మోసాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, ముఖ్యంగా సైబర్ నేరాల నివారణ కోసం గ్రామ స్థాయి వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అక్రమ గంజాయి రవాణా, మట్కా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాల వ్యవస్థను విస్తరించి, అవి నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలని తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ తగిన నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరుస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ స్థాయి పోలీసింగ్ను మరింత బలోపేతం చేయాలని, విలేజ్ పోలీస్ అధికారులు గ్రామాల్లో తరచూ పర్యటిస్తూ ప్రజలతో మమేకమై సామాజిక సమస్యలను తెలుసుకుని ముందస్తు సమాచార సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ కె. శంకర్, గద్వాల డీఎస్పీ వై. మొగిలయ్య, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్సైలు మరియు ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.