చెరుకుపల్లి గ్రామంలో ఉద్రిక్తత: భజరంగ్ దళ్ కార్యకర్తపై దాడి
నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చెరుకుపల్లి గ్రామంలో భజరంగ్ దళ్ కార్యకర్త పులుసు రాజు పై జరిగిన దాడి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గ్రామంలో ఇటీవల హిందూ సంఘటనా కార్యక్రమాలు చురుకుగా కొనసాగుతున్న నేపథ్యంలో, కొందరు వ్యక్తులు కక్ష పెంచుకొని ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఏప్రిల్ 12, 2026 శనివారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో, బాధితుడు తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్తుండగా కారుతో ప్రమాదం సృష్టించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్న అనంతరం, కొందరు వ్యక్తులు అతడిని వెంబడించి తల, మెడ, ఛాతి, కడుపు, వీపు భాగాలపై దాడి చేసినట్లు పేర్కొన్నారు.
ఈ ఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. సాధారణంగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించే కార్యకర్తపై ఇలాంటి దాడి జరగడం తీవ్రంగా ఖండనీయమని స్థానికులు పేర్కొంటున్నారు.
ఈ ఘటనపై విశ్వహిందూ పరిషత్ నకిరేకల్, కేతేపల్లి, శాలిగౌరారం మండలాల ప్రఖండ అధ్యక్షుడు నకిరేకల్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో తీవ్రంగా స్పందించారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా, గ్రామంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు పోలీసు శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.