ఎత్తిపోతల పథకాల భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి.
నెట్టెంపాడు భూ సేకరణ 45 రోజుల్లోగా పూర్తవ్వాలి.
సమీక్ష సమావేశంలో ఆర్ అండ్ ఆర్ కమిషనర్, కలెక్టర్ ఆదేశాలు.
జోగులాంబ గద్వాల 9జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా వివిధ ప్యాకేజీల పరిధిలో సేకరించాల్సిన 534 ఎకరాలలో ఎలాంటి ఇబ్బందులు లేని భూ సేకరణ ప్రక్రియను ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 రోజుల్లోగా పూర్తి చేయాలని ఆర్ అండ్ ఆర్(రిహాబిలిటేషన్ మరియు రీ సెటిల్మెంట్) కమిషనర్ శివకుమార్ నాయుడు అన్నారు.
జిల్లాలోని నెట్టెంపాడు, గట్టు ఎత్తిపోతల పథకాలతో పాటు మల్లమ్మ కుంట రిజర్వాయర్ కు అవసరమైన భూ సేకరణ పై మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో కమిషనర్ తో పాటు జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రాజెక్టులపై సమీక్ష చేసేందుకు ఇటీవల పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి గద్వాల జిల్లా పెండింగ్ ప్రాజెక్టులపై మాట్లాడారన్నారు. ఆయా ప్రాజెక్టుల పరిధిలో భూ సేకరణ ఆలస్యం కావడంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారని, ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించి ముందుకెళ్లాల్సిందిగా ఆదేశించారన్నారు. గట్టు ఎత్తిపోతల పథకంకు సంబంధించి 462 ఎకరాలను, ఆర్డీఎస్ పరిధిలోని తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా ఫేజ్2 కింద నిర్మిస్తున్న మల్లమ్మ కుంట రిజర్వాయర్ కు 567 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందన్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ప్రారంభమై చాలా ఏళ్లు కావడంతో భూసేకరణ విషయంలో దీనికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్లాలన్నారు. నెట్టెంపాడు పరిధిలో మొత్తం 534 ఎకరాల్లో కోర్టు కేసులు, ఇతర సమస్యలు లేని సుమారు 220 ఎకరాలకు ఈనెల 15వ తేదీలోగా ప్రిలిమినరీ డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. ఆయా ప్రాజెక్టుల పరిధిలో భూసేకరణ పూర్తయితేనే ఎత్తిపోతల పథకాల పనులను సకాలంలో పూర్తిచేసి సంబంధిత ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించేందుకు వీలుంటుందన్నారు. జిల్లాలోని వివిధ రిజర్వాయర్లలో ముంపుకు గురైన గ్రామాల ప్రజలకు పునరావాస కేంద్రాలలో ఆవాసం కల్పించినందున అక్కడ వారికి కల్పిస్తున్న కనీస మౌలిక వసతులలో పెండింగ్ లో ఉన్న పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయా పథకాలకు సంబంధించి వివిధ మండలాల పరిధిలో సంబంధిత గ్రామాల్లో సేకరించాల్సిన భూ సేకరణ పై అధికారులతో క్షుణ్ణంగా మాట్లాడారు.
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ జిల్లాలోని ఆయా ఎత్తిపోతల పథకాలకు అవసరమైన భూ సేకరణ విషయంలో ఎవరైనా రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైతే ప్రభుత్వ అవసరాలు, ప్రాజెక్టుల ఆవశ్యకతను గురించి వారికి వివరించి ఒప్పించాలన్నారు. రెవిన్యూ, సర్వే, ఇరిగేషన్ శాఖల అధికారులు ప్రత్యేక టీములుగా ఏర్పడి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కృష్ణ, ఇరిగేషన్ శాఖ సిఈ రహీముద్దీన్, సర్వే ఏడి నూకరాజు, కలెక్టరేట్ ఏవో భూపాల్ రెడ్డి, వివిధ మండలాల తహసిల్దార్లు, నీటి పారుదల శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.