భరతమాత ముద్దుబిడ్డ....కామ్రేడ్ భగత్ సింగ్....కాలం నుదిటిపై మెరిసే సింధూరం

Mar 21, 2025 - 13:41
 0  16
భరతమాత ముద్దుబిడ్డ....కామ్రేడ్ భగత్ సింగ్....కాలం నుదిటిపై మెరిసే సింధూరం

తెలంగాణ వార్త రిపోర్టర్  భరతమాత ముద్దుబిడ్డ....కామ్రేడ్ భగత్ సింగ్....కాలం నుదిటిపై మెరిసే సింధూరం_* ???????????????????????????????????????????????????????????????????????? ”మనకు సోషలిస్టు విప్లవం కావాలి.దానికి ముందు రాజకీయ విప్లవం రావాలి.రాజకీయ విప్లవమంటే ప్రభుత్వం బ్రిటీష్‌ పాలకుల నుండి భారతీయుల చేతుల్లోకి మారడం మాత్రమే కాదు.విశాల ప్రజామద్దతుతో విప్లవ పార్టీ చేతుల్లోకి అధికారం రావాలి.ఆ తర్వాత సోషలిస్టు ప్రాతిపదికపై మొత్తం సమాజ పునర్నిర్మాణానికి పూనుకోవాలి” స్వాతంత్య్రానంతర భారతదేశ నిర్మాణం పట్ల భగత్‌సింగ్‌ భావనలివి. తనను ఉరితీయడానికి కొద్దిరోజుల ముందు…1931 ఫిబ్రవరి 2న జైలు నుండి వెల్లడించిన ఓ వ్యాసంలోని ఈ వ్యాఖ్యలు ఆయన లోతైన ఆలోచనలకు ప్రతీకలు. భగత్‌సింగ్‌ను కేవలం ఓ స్వాతంత్య్ర సమరయోధుడిగా,బ్రిటీష్‌ పాలకులను గడగడలాడించిన సాహసిగా మాత్రమే చూస్తే అది అసమగ్రమేనని ఈ వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. చరిత్రలో ఏ వ్యక్తినైనా పరిశీలించేందుకు,అందునా భగత్‌సింగ్‌ లాంటి ఆలోచనాపరుడిని, విప్లవకారుడిని అంచనా వేయడానికి లోతైన పరిశీలన అవసరం.మౌలికంగా ఆ వ్యక్తి ఆలోచనా విధానం,దాని వికాసం తెలుసుకోకుండా పరిశీలిస్తే వాస్తవాలకు దూరంగా ఉండిపోతాం.పాక్షిక సత్యాలకే పరిమితమవుతాం.భగత్‌సింగ్‌ విషయంలో అదే జరిగింది. అందుకు కారణం వలస పాలకులు సరిగ్గా నమోదు చేయని అధికారిక రికార్డులు కావొచ్చు,ఆయన ఆలోచనల విస్తృతిని నివారించాలన్న స్వాతంత్య్రానంతర పాలకవర్గాల ఉద్దేశాలు కావొచ్చు,మితవాద శక్తుల కుతంత్రాలు కావొచ్చు.ఇలా కారణాలేమైనప్పటికీ మనం భగత్‌సింగ్‌ను పూర్తిగా తెలుసుకోవడంలో వెనుకబడి పోయాం.ఫలితంగా ఆయన కేవలం గొప్ప దేశభక్తుడిగా,పోరాట యోధుడిగా,త్యాగధనుడి గానే మనలో చాలామందికి గుర్తుండి పోయాడు. బ్రిటీష్‌ పాలన నుంచి విముక్తి సాధించడమే ఆయన ఏకైక రాజకీయ లక్ష్యంగా ప్రచారంలో ఉండిపోయింది.కానీ అంతకు మించిన ఆయన సైద్ధాంతిక పునాది గురించి,ప్రాపంచిక దృక్పథం గురించి ఎంతమందికి తెలుసు? అది తెలుసుకోవడం ఇప్పుడు దేశానికి చాలా అవసరం. నేడు దేశంలో నిజం నిందలు మోస్తున్నది.అబద్ధం అందలమెక్కి ఊరేగుతున్నది.మనుషులు మనుషులుగా కొనసాగే పరిస్థితులు సన్నగిల్లిపోతున్నాయి.మోసం ద్వేషం ప్రజల మెదళ్లలోకి చొప్పించబడుతున్నది. అనేకానేక ఆధిపత్యాల నుంచి, అజ్ఞానపూరిత మూఢనమ్మకాల నుంచి దేశాన్ని కాపాడవలసిన పాలకులు,శాస్త్రీయతను పెంపొందించాల్సిన ప్రభుత్వాలే పౌరులను తిరోగమనంలో ముంచెత్తుతున్న వర్తమానమిది.ప్రశ్నిస్తే పౌరస్వేచ్ఛను,ప్రజాస్వామ్యాన్ని నిర్బంధంలోకి నెట్టేస్తున్న కాలమిది.మతాన్ని రాజ్యంతో విడదీయ లేనంతగా కలిపేసి,మత ప్రాతిపదికన రాజకీయ సమీకరణలకు పాల్పడుతున్న రోజులివి. విశ్వాసం విద్వేషంగా మారి మన రాజ్యాంగ స్ఫూర్తికే సవాలు విసురుతోంది.మన ప్రజాస్వామ్యం మునుపెన్నడూ లేనంతగా ప్రమాదంలో పడింది.సమాజంలో సామరస్యం బీటలువారుతున్నది. ప్రజాజీవితంలో భయం రాజ్యమేలుతున్నది.ఒక అభద్రతాభావం వెంటాడుతున్నది.అబద్ధాల పునాదుల మీద మిథ్యా చరిత్రని నిర్మించే మిత- మతవాద రాజకీయాలు సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నాయి.దీన్ని ప్రశ్నించాల్సిన పౌరసమాజం మౌనంగా వీక్షిస్తున్నది. ఈ మొత్తం సందర్భాన్ని మనం ఎలా చూడాలి? ఎలా ఎదుర్కోవాలి? లౌకిక,ప్రజాస్వామిక శక్తుల పాత్ర ఎలా వుండాలి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమివ్వగలిగిన మేధోసంపత్తిని మనకు వారసత్వంగా అందించి పోయాడు భగత్‌సింగ్‌.అది పూర్తిగా ఆచరణాత్మకమైనదీ, సైద్ధాంతికమైనది.అందువల్ల భగత్‌సింగ్‌ను అధ్యయనం చేయటం నేటి తరానికి అత్యంత అవసరం. ”మతమౌఢ్యం,మతోన్మాదం మన పురోగతికి పెద్ద అడ్డుగోడలు.అవి దారిలో అనేక ఆటంకాలు సృష్టిస్తాయి.మనం వాటిని పక్కకు నెట్టుకుంటూ ముందు కెళ్లాలి.మతాలన్నింటిలో కనిపించే మూఢవిశ్వాసాలు, ఛాందసవాదం,సంకుచిత ధోరణుల వల్లే మనుషులు దోపిడీకి గురవుతున్నారు” అంటాడు భగత్‌సింగ్‌. మతం దోపిడీదారుల చేతుల్లోని ఒక సాధనమని ఆయన ఆనాడే గ్రహించాడు.కాబట్టే 1924లో తన పదిహేడేళ్ల వయసులోనే ”విశ్వమానవ సౌభ్రాతత్వం” అనే అద్భుతమైన రచన చేశాడాయన.అందులో ”ప్రపంచంలోని మానవులందరూ ఒకటే..ఎవరూ మరెవరికీ పరాయి కాదు” అంటాడు. ”నలుపు-తెలుపు, నాగరికులు-అనాగరికులు, పాలకులు-పాలితులు,ధనిక -పేద,అగ్రవర్ణాలు-అంటరాని వర్గాలు అనేవి ఉనికిలో ఉన్నంత కాలం విశ్వమానవ సౌభ్రాతత్వం ఎలా సాధ్యమవుతుంద”ని ప్రశ్నించాడు.ఇవి సర్వమానవ సౌభ్రాతృత్వానికి అవరోధాలని చెప్పాడు.ఆ వయసులో ఎవరైనా అంతటి ఆలోచనాపరులై ఉంటారని ఊహించగలమా? కానీ ఆయన అలాంటి ఆలోచనలు కలిగి ఉండటమే కాదు,వాటి ఆచరణకు జీవితాన్నే ధారపోశాడు.మనిషి అసలు గుణం ప్రేమ.సహజీవన సౌందర్యం.అంతే కానీ కులమూ మతమూ కాదు అని చెప్పదలచుకొన్నాడు భగత్‌సింగ్‌. జనజీవితంలో అత్యంత సహజమైనవిగా ఉన్న లౌకిక విలువల పట్ల అచంచలమైన విశ్వాసాన్ని ప్రకటించాడు. 1926లో ”నౌజవాన్‌ భారత సభ” స్థాపన ద్వారా భగత్‌సింగ్‌ తన ఆలోచనలకు నిర్మాణ రూపమిచ్చాడు.ప్రజలకోసం ప్రజల చేత విప్లవం సాధించడం సభ లక్ష్యంగా ప్రకటించాడు. ఈ లక్ష్యసాధనలో మతం మన పురోగతికి అతిపెద్ద ఆటంకమని సభ ప్రణాళికలో నిర్ధిష్టంగా పేర్కొన్నాడు.విభేదాలు పక్కన పెట్టి ఒక ఉమ్మడి అజెండాతో లౌకిక,ప్రజాస్వామిక ప్రాతిపదిక మీద కలసి పనిచేయడం ద్వారానే మనం పురోగమించగలమని చెప్పాడు.మతాన్ని రాజకీయాల నుండి విడదీయగలిగితేనే మనం ప్రజలను ఐక్యంగా ఉంచగలమని స్పష్టం చేశాడు.భారతదేశ అభ్యున్నతిని కోరేవారెవరైనా దీన్నే అనుసరిస్తారని చెప్పాడు.భారతదేశానిది సమ్మిళిత సహజీవన సంస్కృతి అని నినదించాడు.నిజమే కదా..! ‘భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు.సుపంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం’ అని నిత్యం ప్రతిజ్ఞ చేస్తున్నాం మనం.శతాబ్దాలుగా దేశం సంతరించుకున్న ఈ విలువలను కాపాడుకోవడం,సమున్నతంగా నిలబెట్టుకోవడం ఇప్పుడు కాలం మన ముందు నిలిపిన అతిపెద్ద సవాలు.ఈ సవాలును ఎదుర్కోవడానికి మనకిపుడు భగత్‌సింగ్‌ కావాలి.ఆయన భావజాలం కావాలి. భగత్‌సింగ్‌ను అర్థం చేసుకోవాలంటే ఆయన రచనలు చదవాలి.ముఖ్యంగా జైలు నోట్‌బుక్‌ మనకు ప్రధాన వనరు. ఆయన సాధించిన సైద్ధాంతిక పరిణితిని తెలుసుకోవడానికి అది చాలా ఉపయోగపడుతుంది.మిగతా రాజకీయ ఖైదీల్లా ఆయన జైలులో ఉండి ఆత్మకథలు రాసుకోలేదు.ఈ ప్రపంచాన్ని అధ్యయనం చేశాడు. గాయాలపాలైన ఈ నేల విముక్తికి మార్గాలను అన్వేషించాడు.మహా మహులనేకమంది రచనలను,రాజకీయ సిద్ధాంతాలను లోతుగా పరిశీలించాడు.ఆ తరువాత మార్క్సిజం వెలుగులో భారతదేశ భవిష్యత్తును దర్శించాడు. నిస్తేజంగా పడివున్న ఈ నేలకు జవసత్వాలు కూడగట్టేందుకు అవసరమైన భావజాలాన్ని అభివృద్ధి చేశాడు.”దోపిడీ పీడనలు,అసమానతలు లేని సమాజ స్థాపన కోసం మన ప్రజలను సిద్ధం చేయాలి.ఈ విప్లవ బీజాలను నాటడానికి ఇప్పుడున్న పంటలన్నిటినీ ధ్వంసం చేయాలి. ముండ్లపొదలను పీకి తగల బెట్టాలి.బండరాళ్లను కంకరగా పగలగొట్టాలి.కిందపడిన వారిని పైకి లేవనెత్తాలి.అరాచకులకు మర్యాద నేర్పాలి.శ్రామిక ప్రజలను ఒక్కటి చేయాలి.ఇందుకు అడ్డుగా ఉన్న కులమతాల గోడల్ని కూలగొట్టాలి” అని నిర్దేశించాడు. ఈ లక్ష్య సాధనకు ఏంచేయాలో కూడా వివరించాడు.”ప్రజలు తమలో తాము పోట్లాడుకోకుండా వారిలో వర్గ ధక్పథాన్ని కల్పించాలి.కార్మికులకు,రైతులకు వారి మొదటి శత్రువు పెట్టుబడిదారుడని చెప్పాలి.వారు సృష్టించే కులమతాల ఉచ్చుల్లో పడవద్దని వివరించాలి. మనుషులు ఏ కులం వారైనా,ఏ మతం వారైనా,ఏ జాతి వారైనా ఒకే విధమైన హక్కులు కలిగి ఉంటారని తెలియజేయాలి. ఆ హక్కులు వారి ఐక్యతలో ఉన్నాయని,వారి సంక్షేమం అధికారాన్ని తమ చేతుల్లోకి లాక్కోవడంలో ఉందని అర్థం చేయించాలి” అన్నాడు. పెట్టుబడిదారీ ప్రభుత్వాలేవి ప్రజలను చైతన్యవంతులను చేసే కృషిని సమ్మతించవు. పైగా నిర్దయగా అణచివేస్తాయి.కనుక ఈ స్థితిని రూపుమాపాలంటే విప్లవం ద్వారా మనం అధికారాన్ని చేతుల్లోకి లాక్కోవాలంటాడు భగత్‌సింగ్‌.విప్లవమంటే రక్తపాతంతో కూడిన ఘర్షణలుకావు.అది బాంబులు, తుపాకుల పూజ కాదు.కొన్ని సందర్భాల్లో అవి కూడా లక్ష్యాన్ని సాధించే సాధనాలు కావొచ్చు. అంతే తప్ప అదే విప్లవమని చెప్పలేం. విప్లవమంటే నిజమైన అర్థం మెరుగైన మార్పు కోసం జరిగే పోరాటం.పాత నుండి కొత్తకు ప్రయాణించడం.మానవ చైతన్యం తిరోగమన శక్తుల్ని తొక్కుకుంటూ పురోగమించడం అంటూ విప్లవానికి నిర్వచనం చెప్పాడు భగత్‌సింగ్‌.”ఇప్పుడు ఈ తిరోగమన శక్తుల మూలంగా దేశం దయనీయ స్థితిని ఎదుర్కొంటోంది.ఒక మతస్తుడికి మరో మతస్తుడు శత్రువు అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎదుటి వ్యక్తి ముస్లిం అయితే చాలు..అతడిని చంపడానికి హిందువులకు వేరే కారణం అక్కర్లేదు.ఎదుటివాడు హిందువైతే చాలు..అతడిని చంపటానికి ముస్లింలకూ కారణమవసరం లేదు.అలాగే సిక్కులు కూడా.ఈ స్థితి మనుషులను ముక్కలు చేయడం తప్ప ఒక్కటిగా ముందుకు నడిపించగలదా? దీన్ని అడ్డుకోవడం,అధిగమించడం విప్లవకారుల కర్తవ్యం” అంటాడు భగత్‌సింగ్‌.నాడు లాహోర్‌లో చెలరేగిన మతకల్లోల నేపథ్యంలో ఆయన రాసిన ”మతకల్లోలాలు – వాటి పరిష్కారాలు” అనే వ్యాసంలో ఈ విషయాలన్ని సమగ్రంగా వివరించాడు. సరిగ్గా వందేళ్ల తర్వాత అవే పరిస్థితులు ఇప్పుడు దేశంలో కొనసాగుతున్నాయి.పైగా మతతత్వం అధికారంలోకి వచ్చి కూర్చుంది.దేశమంతటా విభజన, విద్వేష రాజకీయాలు మనుషుల్ని చీలికలు పేలికలు చేస్తున్నాయి.శాంతినీ సామరస్యాన్నీ ధ్వంసం చేస్తున్నాయి. మనువాదం మనిషిని తిరిగి మధ్యయుగాలకు మల్లించజూస్తోంది.దారిలో ముండ్లు కనబడితే ఎత్తిపారేసే మనిషి,రాళ్లూ రప్పలూ ఎదురైతే తొలగించి నడిచే మనిషి ఇప్పుడు అచేతన జీవిలా మారిపోతున్నాడు.మనిషి మనిషిగా జీవించడానికి కావాల్సిన సహజమైన ఆవరణమే లేకుండాపోతోంది. ఈ ఆవరణాన్ని కమ్ముకుంటున్న చీకటిని ఛేదించే టార్చ్‌బేరర్‌ భగత్‌సింగ్‌.అందుకే మనకు భగత్‌సింగ్‌ కావాలిప్పుడు.ఈ స్థితిని అర్ధం చేసుకోవడానికీ అధిగమించడానికీ కావాల్సినంత అవగాహననూ చేతననూ మనకందించి పోయాడు భగత్‌సింగ్‌.వాటిని అందిపుచ్చుకోవాలి.విద్వేషం వీధివీధినా పారుతున్న వేళ.. ప్రేమను గడపగడపకూ పంచిపెట్టాలి.రక్తసిక్తమైన హృదయాలకు లేపనాలు పూయాలి..మతమౌఢ్యం మనకు వారసత్వంగా సంక్రమిస్తున్న ఓ పెద్ద అబద్ధమని కుండబద్ధలు కొట్టాలి.నీతికి మూలం మనిషే కావాలి తప్ప,మతం కాకూడదని నినదించాలి.భగత్‌సింగ్‌ ఇందుకు అవసరమైన చూపునిస్తాడు, పోరాడే బలమిస్తాడు. విధ్వంసమైన బతుకుల్ని విప్లవ కార్యాచరణకు నడిపించడమెలాగో వివరిస్తాడు.నిత్యం కాలం నుదిటిపై నిగనిగలాడే ఎర్రని సింధూరమతడు. (మార్చి 23 భగత్‌సింగ్‌ 94వ వర్థంతి) *✍️✍️✍️✍️-సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి.... ప్రజా నేస్తం కామ్రేడ్ జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్ ఫోన్ నెంబర్ 8328277285*