జర్నలిస్టుల సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తాం
ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు
-మంత్రిని కలిసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు
హైదరాబాద్, జూలై 16: రాష్ట్రంలోని జర్నలిస్టులు ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. జర్నలిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. గురువారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంత్రి శ్రీధర్ బాబు ను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి "టీడబ్ల్యూజేఎఫ్ మీడియా డైరీ" ని అందజేసింది.
ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల సంక్షేమ అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన పరిష్కారానికి చర్యలు చేపట్టాలని మామిడి సోమయ్య విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు, జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని, ముఖ్యమంత్రితో చర్చించి వీలైనంత త్వరగా పరిష్కార మార్గాలను అన్వేషిస్తామని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమని, వారి సంక్షేమం పట్ల ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు కుంచెం శ్రీనివాస్, వి. రవికుమార్, పర్కాల సమ్మయ్య గౌడ్, చొల్లేటి బ్రహ్మచారి, ఎం.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.