గోడ కూలి విషాదం: రక్షాబంధన్ ఆనందం మరువకముందే.. చెల్లెలు కన్నుమూత
జోగులాంబ గద్వాల 21 ఆగస్టు 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- మున్సిపాలిటీ 14వ వార్డులో విషాదం నెలకొంది. నిన్న రాత్రి 10 గంటల సమయంలో ఓ గుడిసె గోడ కూలి ఎనిమిదేళ్ల చిన్నారి మృతి చెందింది. చాకలి నర్సింహులు కుమార్తె శ్రీకృతి (8) నాలుగో తరగతి చదువుతోంది. నర్సింహులు కుటుంబం గుడిసెలో నిద్రిస్తుండగా అకస్మాత్తుగా గోడ కూలి శ్రీకృతిపై పడింది.
ఈ ఘటనలో శ్రీకృతి అక్కడికక్కడే మృతి చెందింది. మిగిలిన కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడ్డారు. రక్షాబంధన్ పండుగ మరుసటి రోజే ఈ విషాదం చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. చెల్లెలి చేతుల మీదుగా రాఖీ కట్టుకున్న ఆనందం ఇంకా మరువకముందే ఆమెను శాశ్వతంగా కోల్పోవడంతో శ్రీకృతి సోదరులు షాక్ లో ఉన్నారు. చిన్నారి మృతితో స్థానికులు, బంధువులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.