ఉపాధ్యాయుడుగా మారిన జిల్లా కలెక్టర్

జోగులాంబ గద్వాల 15 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:-
విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేలా వారికి అర్ధమయ్యే రీతిలో బోధించాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ ఉపాధ్యాయులను ఆదేశించారు.
బుధవారం జిల్లా కేంద్రంలోని బురదపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులతో పాఠాలు చదివించారు. ప్రత్యేక తరగతులను ప్రతిరోజు కచ్చితంగా నిర్వహించాలని, విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. పదవ తరగతి ఫలితాల్లో జోగులాంబ గద్వాల జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉండేలా చదవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. ఎఫ్ ఆర్ ఎస్ (ఫేస్ రికగ్నైజింగ్ సిస్టం) లో హాజరు వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారా అని ఉపాధ్యాయులను అడిగారు. విద్యార్థుల హాజరు శాతం పెరగాలని, ఏమైనా సమస్యలు ఉంటే పేరెంట్స్ సమావేశాల్లో చర్చించి అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో మరుగుదొడ్ల కొరత ఉందని ఉపాధ్యాయులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడి ఎలాంటి సమస్యలున్న పరిష్కరిస్తామని కలెక్టర్ తెలియజేశారు.