శాస్త్రీయత, సమైక్యతలను పండుగలకు పునాదిగా తీసుకోవాలి
శాస్త్రీయత, సమైక్యతలను పండుగలకు పునాదిగా తీసుకోవాలి.
హోలీ పండుగకు ప్రకృతి తో పాటు సామాజిక ఐక్యత, శ్రామిక దృక్పథము అంతరార్థాలుగా గుర్తిస్తేనే అర్థం ఉంటుంది.
అది మానవ నైజం కావాలి.
--వడ్డేపల్లి మల్లేశం
భారతీయ సంస్కృతిలో ప్రధానంగా వ్యవసాయకi దేశమైన ఇండియాలో శ్రమైక జీవన సౌందర్యం సామాజిక జీవనంలోని అత్యంత ప్రాధాన్యత కల అంశం. వైజ్ఞానికంగా యాంత్రికంగా ప్రపంచముతో పాటు భారతదేశ కూడా అనేక రంగాల్లో ఎదిగినప్పటికీ శ్రమకు, శ్రామిక దృక్పథానికి, మానవ అవసరాలకు, సజీవ మానవ సంబంధాలకు ఇప్పటికీ ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ అంశం పునాదిగానే తోటి మనిషిని సాటి మనిషిగా చూసే గౌరవ సాంప్రదాయం అంతో ఎంతో కొనసాగుతున్నది కూడా. ఆధునిక పోకడలు, స్వార్థ చింతన హింసావాదం, మత విదేశాలు, కులతత్వం వంటి సామాజిక రుగ్మతలు విస్తరించిన కారణంగా కొన్ని అసమానతలు అంతరాలు చోటు చేసుకుoటు న్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం మాదిరిగా ఎంతో కొంత సమైక్యతను చాటుకోవడానికి మన దేశంలో పండుగలు తోడ్పడుతున్నాయి. అయితే ఇప్పటికి కొన్ని పండుగలు ఒంటెద్దు పోకడలాగా ఒక వర్గాన్ని దూషించే సంప్రదాయం కూడా కొనసాగుతున్నది. అలాంటి పండుగలలో దసరా పండుగ రోజు ఇటీవల కాలంలో జరిపే రావణ దహనం కార్యక్రమం నిర్వహణ పైన భిన్నభిప్రాయాలు, వైరుద్యాలు రావడంతో కొంత సద్దు మణి గినప్పటికీ ఒక వర్గాన్ని కించపరిచే భావజాలాన్ని కాకుండా సమైక్యతను చాటే విధంగా మన ఆలోచనలు ఉండాలి.
ఇలాంటి వైరుద్యాలు ఏ మతంలో వున్నా నిరసించాలి. అలాంటి అంశమే హోలీ పండుగ సందర్భంగా హో లిక అనే రాక్షసిని పండుగకు ఒకరోజు ముందు కాల్చివేస్తారని చెడుపై మంచికి విజయమని చెబుతుంటారు. కానీ ఇదంతా పుక్కిడి పురాణం అని, కల్పిత కథలని ఆధ్యాత్మిక పౌరాణికవేత్తలే చెబుతున్నారంటే మనం పండగ యొక్క ప్రాశస్త్యాన్ని శాస్త్రీయ కోణంలో ఆలోచించడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నది. ప్రతి పండుగ యొక్క ప్రాధాన్యత అంతిమంగా సమైక్యత సమభావం, మానవీయ విలువల పరిరక్షణ, అసమానతలు అంతరాలను వీలైన మేరకు తగ్గించడం ద్వారా వివక్షతకు తావు లేకుండా చూడడం ప్రధానo. కానీ మతం పేరుతో భారత వ్యవస్థలో తమ మతమే గొప్పదని ఇతర మతాలు ప్రాధాన్యత లేనివని అప్పుడప్పుడు కామెంట్స్ చేయడం వలన మత ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. అలాంటి వాటికి తావు లేకుండా ప్రతి మతం కూడా తమ పండుగలను జరుపుకోవడానికి వీలైనటువంటి వాతావరణంలో కల్పించడం ద్వారా భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించవలసిన నైతిక ధర్మం ప్రతి వ్యక్తి పైన ఉన్నది.మాతతత్వంఎక్కడున్నా నిరసించవలసిందే. సర్వమానవ్వాలి కళ్యాణమే మన ఆలోచనలకు గీటు రాయి కావాలి.
హోలీ పండుగకు శాస్త్రీయత సమైక్యత జోడించాలి
చారిత్రక ఆధ్యాత్మిక పౌరాణిక ఆధారాలు లేనటువంటి అనేక గాథలు ప్రచారంలో ఉన్నప్పటికీ హోలీ పండుగకు సంబంధించి మాత్రం ప్రత్యేకత ఉన్నట్టు ఆధ్యాత్మికవేత్తలే ప్రకటిస్తున్నారు. చైత్రమాసం నుండి మాఘ మాసం వరకు ప్రతి నెలలో వచ్చే పౌర్ణమికి ప్రత్యేకత ఆధ్యాత్మికంగా ఉన్నప్పటికీ మాఘ పౌర్ణమి అంటే హోలీ పండుగ నిర్వహించుకునే రోజుకు మాత్రం ఆధ్యాత్మిక భావన కాకుండా ప్రకృతి పరమైన ప్రాధాన్యత ఉన్నట్లు వాళ్లే అంగీకరిస్తున్నారు. పైగా హో లిక అనే రాక్షసిని కల్పించి కాల్చి వేసినట్లు చెడుపై మంచికి విజయమని కల్పిత గాతలు అనేక ఉన్నాయని అందులో వాస్తవం లేదని కొట్టిపడేస్తున్నారు.కనుక ఇది ప్రకృతి పండుగగా లేదా సమైక్యతకు గుర్తుగా నిర్వహించుకునే పండుగని మనం గుర్తిస్తేనే సరైన అర్థం ఉంటుంది.
ఈ పండుగ నాటికి వసంత రుతువు ఆగమనంతో ప్రకృతి పులకించి పోయే విధంగా రంగు రంగుల పూలు చిగుర్లు ఆకులు అందాలతో వెలసిల్లుతూ ఉంటే శీతాకాలం ముగిసి వాతావరణం అనుకూలంగా మారడంతో ఉత్సాహంగా ప్రజలు తమ పనులను చేసుకోవడానికి ఇష్టపడతారని సంతోషాన్ని ఈ సమయంలో మరింత పెంచుకోవడానికి గుర్తుగా రంగులు చల్లుకుంటూ బొట్టు పెట్టుకోవడంతో పాటు బంధువులు తమ ఆత్మీయత ఆప్యాయతలను పంచుకుంటారని, స్నేహితులు సామూహికంగా వీధుల్లో సంచరిస్తూ తమ హావ భావాలను ప్రదర్శిస్తూ రంగులు చల్లుకుంటూ కేరింతలతో ప్రత్యేకతను చాటుకుంటారని మనం నిజజీవితంలో ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాo. ఈ క్రమంలో కొన్ని అపసృతులు చోటు చేసుకున్న మాట కూడా వాస్తవం. అంతేకాకుండా వీధులు రోడ్లు అన్నీ కూడా అ- పరిశుభ్రతకు గురికావడాన్ని గమనించాల్సిన అవసరం కూడా ఉంది. అదే సందర్భంలో వీధులను రోడ్లను శుభ్రం చేసే శ్రామికులు, పారిశుద్ధ్య కార్మికులను కూడా మనం తలుచుకోవడం చాలా అవసరం. శ్రామిక దృక్పథం కలిగి ఉండడం అంటే శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆరాధించడం, శ్రామికుల యొక్క కష్టాన్ని గౌరవించడం, గుర్తించడం, కృతజ్ఞత చాటుకోవడమే.
ఈ పండుగ సందర్భంగా వీధులు వాడలు రోడ్లు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచే క్రమంలో ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం వరకు కూడా మురికి, అపరిశుభ్రత, అనారోగ్యం అని లెక్క చేయకుండా పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులతో ప్రత్యేక కార్యక్రమాన్ని టీవీ9 ఏర్పాటు చేయడం ద్వారా వారి యొక్క శ్రమను ప్రపంచానికి చాటి చెప్పిన తీరు గుర్తించదగినది. "మౌనంగా ఉండి ప్రాధాన్యతలను గుర్తించకుండా, అవసరమైన చోట కృతజ్ఞతలు చాటకుండా, ప్రశ్నించవలసినచోట నిశ్శబ్దంగా ఉండి, తమ బాధ్యతలను విస్మరించే పౌర సమాజం ప్రతి పండుగ యొక్క ప్రాశస్యాన్ని గుర్తించడం ద్వారా అంతరార్తాన్ని అర్థం చేసుకుని సమాజ సేవలో సామాజిక బాధ్యతను నిర్వర్తించడం అనే లక్షణం ఈ పండుగల ద్వారా పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది". " .హోలీ పండుగ సందర్భంగా అనారోగ్యానికి ఇబ్బందులకు గురి చేసే విషపూరితమైన రంగులు లేదా ద్రవపదార్థాలు కోడిగుడ్లు ఇతర పదార్థాలను విచ్చలవిడిగా వాడి ప్రకృతిని అల్లకల్లోలం చేయడమే కాకుండా రోగాల బారిన పడే సంస్కృతికి మంగళం పాడి ప్రకృతిని ప్రేమించి ఆరాధించే ప్రకృతి వనరుల కాపాడుకునే సానుకూల దృక్పథం వైపు ప్రధానంగా యువత మానవాళి శ్రమించినప్పుడు మాత్రమే ప్రకృతి అనుబంధాంగా ఉన్నటువంటి అన్ని పండుగలను సమర్థవంతంగా నిర్వహించుకున్నట్లు లెక్క. ఆనందం ప్రేమ ఆత్మీయతలకు దర్పణ మైన హోలీ పండుగ అర్థవంతంగా నిర్వహించుకోవడానికి మాత్రమే ప్రజలు సంసిద్ధంగా ఉండాలి. వికృత రీతిలో ఏ పండుగ జరుపుకున్న అది తాత్కాలిక ఆనందమే తప్ప శాశ్వతంగా అనర్థాలకు దారితీస్తుంది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్ధిపేట తెలంగాణ)