మల్టీ జోన్-1లో 15 మంది ఇన్స్పెక్టర్లకు స్థానచలనం
తెలంగాణ పోలీసు శాఖలో బదిలీల పర్వం కొనసాగుతోంది. పరిపాలనా సౌలభ్యం నిమిత్తం మల్టీ జోన్-1 పరిధిలోని 15 మంది పోలీస్ ఇన్స్పెక్టర్లను (సీఐలు) బదిలీ చేస్తూ ఆ జోన్ ఐజీ సంపత్ చంద్రశేఖర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రామగుండం, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్, మహబూబాబాద్, ఆదిలాబాద్, వరంగల్ తదితర ప్రాంతాల్లో పనిచేస్తున్న పలువురు సీఐలకు కొత్త పోస్టింగ్లు దక్కగా, కొందరిని నేరుగా ఐజీ కార్యాలయానికి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. సీఐడీ, పీటీసీల్లో డిప్యుటేషన్పై ఉన్న అధికారులను వెనక్కి రప్పించి కీలక బాధ్యతలు అప్పగించారు. బదిలీ అయిన వారంతా తక్షణమే పాత స్థానాల నుంచి రిలీవ్ అయి, కొత్త పోస్టింగ్లలో బాధ్యతలు స్వీకరించాలని ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వెలువడ్డాయి.