బాలికలు, మహిళల భద్రత కోసం జిల్లా వ్యాప్తంగా షీ టీమ్ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు
జోగుళాంబ గద్వాల 2 జనవరి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల్ జిల్లాలో బాలికల భద్రతను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని, జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐపిఎస్., ఆదేశాల మేరకు గద్వాల్ షీ టీమ్ అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో గద్వాల మండలoలోని దౌదర్పల్లి గ్రామంలో హైస్కూల్లో విద్యార్థినిలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఈవ్ టీజింగ్, మహిళలపై వేధింపులు, పబ్లిక్ ప్రదేశాలలో ఎదురయ్యే ప్రమాదాలు, వాటిని ఎలా గుర్తించాలి, వాటినుంచి ఎలా రక్షించుకోవాలి అనే అంశాలపై విద్యార్థులకు సవివరంగా వివరించారు. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, స్కూళ్లు, కళాశాలలు వంటి జనసంచార ప్రాంతాల్లో మహిళలను వేధించే వ్యక్తులను గుర్తించడంలో షీ టీమ్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
వేధింపులకు గురయ్యే సందర్భంలో విద్యార్థులు ఎటువంటి సంకోచం లేకుండా వెంటనే షీ టీమ్ హెల్ప్లైన్ 8712670312 ను సంప్రదించాలని అధికారులు సూచించారు. ఇట్టి విధముగా కాల్ చేసిన వారి వివరాలు కూడా గోప్యంగా ఉంచుతాము అని తెలిపారు.
ఫిర్యాదు వచ్చిన వెంటనే నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని, ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకున్నట్లు షీ టీమ్ తెలిపింది.
జిల్లా పోలీస్ శాఖ బాలికలు, మహిళల భద్రత, గౌరవ పరిరక్షణను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోందని, ఇటువంటి అవగాహన కార్యక్రమాలు భవిష్యత్తులో మరింతగా విస్తరించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో షీ టీమ్ హెడ్ కానిస్టేబుల్ శేషన్న, పి.సి.లు హనుమంతు, యశ్వంత్, దివ్య వాణి, ఇంచార్జ్ స్టాప్ మాధవి, ఇతర టీచర్స్, విద్యార్థినిలు పాల్గొన్నారు.
—