బడ్జెట్ లో జర్నలిస్టులకు మొండి చెయ్యి
-జర్నలిస్టుల పట్ల వివక్ష తగదు -టీడబ్ల్యూజేఎఫ్ నేత మామిడి సోమయ్య
హైదరాబాద్, మార్చి 20:- రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో జర్నలిస్టుల సంక్షేమానికి ఎటువంటి కేటాయింపులు చేయకుండా మొండి చేయి చూపిందని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపులు చేసిన ప్రభుత్వం జర్నలిస్టులకు సంబంధించి ఎటువంటి ప్రస్తావన చేయకపోవడం, నిధులు కేటాయించకపోవడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు. గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులను విస్మరించిందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ను పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటిదాకా చిన్న మధ్యతర పత్రికలకు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ల బిల్లులు కూడా చెల్లించకపోవడం విచారకరమని అదే విధంగా మీడియా అకాడమీకి బడ్జెట్లో ఏమి చెప్పలేదని ఆయన తెలిపారు.
బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలను ఎలా అమలు చేస్తారని, ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, సంక్షేమ కార్యక్రమాల అంశాలేమీ చెప్పలేదని అన్నారు. ప్రభుత్వం వచ్చిన తరువాత జర్నలిస్టులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని, కనీసం కొత్త అక్రెడిటేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని అన్నారు. చనిపోయిన జర్నలిస్టులకు ఇచ్చే ఆర్థిక సహాయం పెంచాలని ఇళ్ల స్థలాలు కేటాయించాలని హెల్త్ కార్డులు ఇవ్వాలని గత రెండేళ్లుగా తాము ప్రభుత్వాన్ని పదేపదే కోరుతున్నప్పటికీ ప్రభుత్వం తమ డిమాండ్లను పెడచెవిన పెడుతూ జర్నలిస్టులను నిర్లక్ష్యం చేస్తుందని ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఈ బడ్జెట్ పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమాజం దృష్టికి తీసుకుపోతున్న మీడియా పట్ల పాలకులు పూర్తి నిర్లక్ష్యం వహించడం సహించరానిదని, తక్షణమే జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల నిరసన తెలియజేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.