ప్రజావాణిలో ప్రజల సమస్యలకు ప్రాధాన్యం – 18 ఫిర్యాదుల స్వీకరణ, తక్షణ చర్యలకు ఎస్పీ ఆదేశాలు
జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల సమస్యలకు ప్రాధాన్యత ఇస్తూ, జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు ప్రత్యక్షంగా ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 18 మంది ఫిర్యాదుదారులు తమ సమస్యలను ఎస్పీ కి వివరించారు.
ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా వినిపించిన ఎస్పీ, వాటిని స్వయంగా పరిశీలించి, సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు తక్షణ న్యాయం అందేలా చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, అక్కడే ఉన్న డి.ఎస్పీ వై. మొగిలయ్య మరియు గద్వాల, శాంతినగర్ సర్కిల్ అధికారులను పిలిపించి, తమ పరిధిలో వచ్చిన ఫిర్యాదులపై ఇప్పటికే తీసుకున్న చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనితీరుపై సమీక్ష నిర్వహించడం ద్వారా బాధ్యతాయుత పోలీసింగ్కు నిదర్శనంగా నిలిచారు.
ఈ రోజు ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల వివరాలు: భూ వివాదాలు – 06, ప్లాట్ల సమస్యలు – 02, వ్యక్తిగత గొడవలు – 06, మసీదు సీసీ కెమెరాల ధ్వంసం – 01, ఇతర సమస్యలు – 03, ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, ప్రజావాణిలో వచ్చిన ప్రతి ఫిర్యాదును వెంటనే ఆన్లైన్లో నమోదు చేసి, వాటి పురోగతిని జిల్లా కార్యాలయం నుంచి నిరంతరం మానిటర్ చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఫిర్యాదుదారుడికి న్యాయం జరిగేలా కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు. ప్రజావాణి కార్యక్రమంలో స్పందనతో కూడిన చర్యలు తీసుకోవడం పట్ల ఫిర్యాదుదారులు సంతృప్తి వ్యక్తం చేస్తూ, జిల్లా పోలీస్ వ్యవస్థపై విశ్వాసం వ్యక్తం చేశారు..