జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం – రేడియాలజీ హబ్లో పిచ్చి కుక్కల సంచారం
జోగులాంబ గద్వాల 4 మార్చి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం బయటపడుతోంది. ఆసుపత్రి పరిధిలోని రేడియాలజీ హబ్ ప్రాంతంలో పిచ్చి కుక్కలు సంచరిస్తున్న ఘటన రోగులను మరియు వారి బంధువులను భయాందోళనకు గురి చేస్తోంది. వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులు అక్కడ కుక్కలు తిరుగుతుండటంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేడియాలజీ పరీక్షలు చేయించుకునేందుకు వచ్చే రోగులు కుక్కల మధ్యలోనే వెళ్లాల్సిన పరిస్థితి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఆసుపత్రికి వచ్చే సమయంలో ప్రమాదం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఇలాంటి పరిస్థితి నెలకొన్నప్పటికీ అక్కడి సిబ్బంది ఏమి చేస్తున్నారో తెలియడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి ఆసుపత్రి ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచడంతో పాటు పిచ్చి కుక్కలను తొలగించే చర్యలు తీసుకోవాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు.