అరైవ్–అలైవ్’ కార్యక్రమంలో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు
➤ ద్విచక్ర వాహనదారులకు ఉచిత హెల్మెంట్ పంపిణీ.
జోగులాంబ గద్వాల 28 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అరైవ్–అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం రెండవ దశలో భాగంగా జోగుళాంబ గద్వాల్ జిల్లాలో అలంపూర్ సర్కిల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో నేషనల్ హైవే అంటారిటీ ఆఫ్ ఇండియా వారి కో ఆర్డినేషన్ తో శనివారం సాయంత్రం NH 44 పై పుల్లూరు టోల్ ప్లాజా వద్ద ఆటో, లారీ, టాక్సీ డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించబడినట్లు జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐపిఎస్. తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల సహకారంతో నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో సుమారు 100 మంది డ్రైవర్లు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. డ్రైవర్ దృష్టి సామర్థ్యం రోడ్డు భద్రతలో కీలక పాత్ర పోషిస్తుందని, స్వల్ప నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశముందని ఎస్పీ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి డ్రైవర్ తన ఆరోగ్యం, ముఖ్యంగా కంటి చూపు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాహనం ఫిట్నెస్ ఎంత ముఖ్యమో, డ్రైవర్ ఫిట్నెస్ కూడా అంతే ముఖ్యమని తెలిపారు. అవసరమైతే తగిన చికిత్స తీసుకుని కళ్లద్దాలు ఉపయోగించాలని సూచించారు. డిఫెన్సివ్ డ్రైవింగ్ సిస్టమ్ ను అలవర్చుకోవాలి అని తెలిపారు.
‘అరైవ్–అలైవ్’ కార్యక్రమం ప్రధాన లక్ష్యం ప్రతి వ్యక్తి సురక్షితంగా తన గమ్యస్థానానికి చేరుకోవడమేనని తెలిపారు. ఒక నిమిషం మీరు చేసే నిర్లక్ష్యం మీ కుటుంబాన్ని రోడ్డున పాడేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు.
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్ డ్రైవర్లు మరియు ప్రయాణికులు సీట్బెల్ట్ వినియోగించాలని సూచించారు.మద్యం సేవించి వాహనం నడపకూడదని, ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ, పరిమిత వేగంతో ప్రయాణించాలని, ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరి బాధ్యత ముఖ్యమని స్పష్టం చేశారు. అనంతరం NH 44 పై ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులకు ఉచిత హెల్మెట్లను స్వయంగా ధరింపజేయడం జరిగింది.
ఇకనుండి అయిన ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించిలని, అలాగే ఫోర్ వీలర్ లో వచ్చే వారు సీట్ బెల్ట్ ధరించి ప్రయాణించాలని జిల్లా ఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమంలోతో పాటు గద్వాల్ డిఎస్పి వై. మొగిలయ్య, అలంపూర్ సర్కిల్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్, పోలీస్ సిబ్బంది, NHAI మేనేజర్ శ్రీధర్ మరియు సిబ్బంది, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తదితరులు పాల్గొన్నారు.