అంతర్ జిల్లా ఘరానా దొంగ అరెస్ట్
అంతర్ జిల్లా ఘరానా దొంగ అరెస్ట్
గత కొంతకాలంగా మెట్పల్లి సబ్ డివిజన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇళ్లు మరియు మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగను చాకచక్యంగా పట్టుకున్నారు మెట్పల్లి సిఐ ఏ నిరంజన్ రెడ్డి మరియు మల్లాపూర్ ఎస్సై కే రాజు. నిందితుడి నుండి 103 గ్రాముల బంగారు ఆభరణాలు, 125.3 గ్రాముల వెండి ఆభరణాలు మరియు ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. వాటి మొత్తం విలువ 11 లక్షల రూపాయలు.
వివరాలు:
జగిత్యాల జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్ , మెట్పల్లి డిఎస్పి ఏ రాములు గారి పర్యవేక్షణలో, మెట్పల్లి సీఐ ఏ నిరంజన్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడిని గుర్తించింది. 18-02-2025 మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో మల్లాపూర్ ఎస్సై కే రాజు తన సిబ్బందితో కలిసి ముత్యంపేట గ్రామ శివారులోని షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో వాహనాల తనిఖీ చేస్తుండగా, మోటార్ సైకిల్ పై వస్తున్న నిందితుడిని అనుమానాస్పద స్థితిలో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడు.
నిందితుడి నేపథ్యం:
నిందితుడి పేరు మిట్టపల్లి లక్ష్మణ్ @ రవి @ పుండలిక్ విజయ్. తండ్రి: గజ్జారం, వయస్సు: 28 సం. కులం వీరముష్టి, చిరునామా: బైంసా పట్టణం, నిర్మల్ జిల్లా. స్వస్థలం: బైంసా, నిర్మల్ జిల్లా.
లక్ష్మణ్ చిన్నతనంలో తల్లిదండ్రులతో కలిసి రాజీవ్ నగర్, బైంసాలో ఉండేవాడు. అతనికి నలుగురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కలు ఉన్నారు. నలుగురు అన్నదమ్ములలో లక్ష్మణ్ మూడవ వాడు. 6వ తరగతి వరకు బైంసాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. పాఠశాలకు సరిగా వెళ్లకపోవడంతో తండ్రి కొట్టడంతో ఇంటి నుండి పారిపోయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నాడు. అక్కడ దాతలు పెట్టిన భోజనం తింటూ రైల్వే స్టేషన్ లోనే పడుకునేవాడు. కొన్ని రోజుల తర్వాత నాంపల్లిలోని భావర్చి హోటల్ లో 3 సంవత్సరాలు టేబుల్ క్లీనర్ గా పనిచేశాడు. హోటల్ యజమాని జీతం సరిగా ఇవ్వకపోవడంతో గొడవపడి బయటకు వచ్చాడు. నాంపల్లి కూలీ అడ్డాలో కూలీగా పని చేస్తుండగా, ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అతను పని ఇప్పిస్తానని గుల్బర్గా, కర్ణాటకకు తీసుకువెళ్లి దొంగతనాలు ఎలా చేయాలో నేర్పించాడు. ఒకరోజు ఆ వ్యక్తి లక్ష్మణ్ ను గుల్బర్గా రైల్వే స్టేషన్ లో వదిలి పారిపోయాడు. లక్ష్మణ్ తిరిగి హైదరాబాద్ వచ్చి అక్కడక్కడ పనులు చేస్తూ మద్యం, పేకాటకు బానిసయ్యాడు. కూలీ పనితో వచ్చిన డబ్బులు సరిపోకపోవడంతో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు.
లక్ష్మణ్ ఒంటరిగా బస్సుల్లో వివిధ గ్రామాలకు వెళ్లి, తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి, తాళాలు పగలగొట్టి, బీరువాలు తెరిచి బంగారు, వెండి ఆభరణాలు, డబ్బులు దొంగిలించేవాడు. రోడ్లపై నిలిపి ఉంచిన తాళం లేని మోటార్ సైకిళ్లను కూడా దొంగిలించి, వాటిని ఉపయోగించి మరికొన్ని దొంగతనాలు చేసి, వదిలివేసేవాడు. దొంగిలించిన సొమ్ముతో లాడ్జిల్లో ఉంటూ జల్సాలు చేసేవాడు.
లక్ష్మణ్ ఇప్పటివరకు 40 దొంగతనాలు చేయగా, 28 కేసులు కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. 12 కేసుల్లో కోర్టు జైలు శిక్ష విధించింది. అతను గతంలో మూడుసార్లు (మహబూబ్ నగర్, జగిత్యాల, కరీంనగర్) పోలీసుల నుండి తప్పించుకుని పారిపోయాడు. చివరగా, ఆగస్టు 2024లో నిజామాబాద్ జిల్లాలోని ముప్కాల్ మండలంలో ఒక దొంగతనం, అక్టోబర్ 2024లో కమ్మర్పల్లి మండలంలో ఒక దొంగతనం చేసి, పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్ళాడు. డిసెంబర్ 2024లో బెయిల్ పై బయటకు వచ్చి మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామంలో ఒక దొంగతనం, ముత్యంపేట గ్రామంలో మరొక దొంగతనం, మెట్పల్లి పట్టణంలో ఒక మోటార్ సైకిల్ దొంగతనం, మేడిపల్లి మండలం దమ్మన్నపేటలో మరొక దొంగతనం చేశాడు.
స్వాధీనం చేసుకున్న సొత్తు:
• 103 గ్రాముల బంగారు ఆభరణాలు,
• 125.3 గ్రాముల వెండి ఆభరణాలు
• ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు.
• వాటి మొత్తం విలువ సుమారు 11 లక్షల రూపాయలు.
ఈ అంతర్ జిల్లా గజదొంగను చాకచక్యంగా పట్టుకున్న మెట్పల్లి సిఐ ఏ నిరంజన్ రెడ్డి, మల్లాపూర్ ఎస్సై కే రాజు మరియు వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ గారు మరియు మెట్పల్లి డిఎస్పి ఏ రాములు ప్రత్యేకంగా అభినందించారు.
ఇట్లు
ఏ. నిరంజన్ రెడ్డి, సి.ఐ. మెట్పల్లి.