సూర్యాపేట మినీ ట్యాంక్ బండ్ ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాను
తెలంగాణ వార్త సూర్యాపేట 22-01-26:
సూర్యాపేట సద్దలచెరువు మినీ ట్యాంక్ బండ్ వద్ద ప్రజలందరూ సేదతీరే విధంగా, ఆహ్లదకరమైన వాతావరణం ప్రతిబింబించే విధంగా అభివృద్ధి చేస్తానని రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. గురువారం నాడు ఆయన మినీ ట్యాంక్ బండ్ వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ,
సూర్యాపేటను ఒక ప్రత్యేక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతోనే సద్దుల చెరువు మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధికి నిధులు మంజూరు చేశామని తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో ట్యాంక్ బండ్ సంబంధిత పనులు పూర్తిగా నిలిచిపోయి ఉండటంతో, ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి రూ.5 కోట్లతో మినీ ట్యాంక్ బండ్ సుందరికరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఈ అభివృద్ధి పనులను ఆరు నెలల లోపు పూర్తిచేసి, సూర్యాపేట ప్రజలకు మినీ ట్యాంక్ బండ్ను ఒక ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతంగా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా క్యాంటీన్, వాకింగ్ ట్రాక్, లైటింగ్, విశ్రాంతి ప్రదేశాలు సహా అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
అదేవిధంగా, తాను చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రత్యేకంగా కోటి రూపాయల అంచనా వ్యయంతో 80 సీట్ల ఏసీ బోట్ను మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ బోట్ నిర్మాణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని, నెలలోపు పూర్తిచేసి పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ బోట్ను ప్రధానంగా బర్త్డే పార్టీలు, చిన్న ఫంక్షన్లు, చెరువు మధ్యలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. సద్దుల చెరువు పరిసర ప్రాంతంలోని సుమారు 5 ఎకరాల పార్క్ స్థలంలో రూ.15 కోట్లతో ఒక అ అంతర్జాతీయ పార్క్ అభివృద్ధికి నిధులు మంజూరు అయినట్లు తెలిపారు. ఈ పార్క్కు త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని, అవసరమైతే ఇంకా రూ.10 కోట్లు అదనంగా వెచ్చించి అయినా పార్క్ను ట్యాంక్ బండ్, ఐలాండ్ పార్క్ తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పిల్లలతో కుటుంబ సమేతంగా వచ్చే వారికి వినోదంగా గడిపేలా ప్లేయింగ్ జోన్, మినీ థియేటర్ వంటి ప్రత్యేక ఆకర్షణలు కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ అభివృద్ధి పనుల ద్వారా సూర్యాపేటను పర్యాటక రంగంలో ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా సూర్యాపేట పర్యాటక అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసినందుకు పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావుకి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, ముదిరెడ్డి రమణారెడ్డి, డాక్టర్ వూర రామ్మూర్తి యాదవ్,వెలుగు వెంకన్న, ఫరూక్, దొంతిరెడ్డి సైదిరెడ్డి,, ధర్మానాయక్, పర్యావరణ శాఖ అదికారులు పాల్గొన్నారు.