అర్వపల్లి ఎస్సై సస్పెండ్
అర్వపల్లి 18 జూన్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం, నాగారం సర్కిల్ పరిధిలోని అర్వపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఈటా సైదులను బుధవారం జిల్లా ఎస్పీ కె నరసింహ సస్పెండ్ చేశారు.విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించడమే కాకుండా, ఒక కీలక ఫోక్సో కేసు వ్యవహారంలో అనుచిత ప్రమేయం ఉన్నట్లు వచ్చిన ఆరోపణలను సీరియస్గా పరిగణించిన ఉన్నతాధికారులు ఈ చర్య తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.పలు కేసుల్లో ఆధారాలను తారుమారు చేసి అవినీతి, అక్రమాలను పాల్పడ్డట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనల పై ఉన్నతాధికారులు ప్రాథమిక స్థాయిలో విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. విచారణలో బయటపడిన అంశాల ఆధారంగా తక్షణ చర్యగా సస్పెన్షన్ విధించినట్లు సమాచారం.
ఈ పరిణామం పోలీస్ విభాగంలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. విచారణ అనంతరం మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.