రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
డాక్టర్లు నిరంతరం పేషేంట్లకు అందుబాటులో ఉండాలి
వేగవంతంగా జనరల్ హాస్పిటల్ నూతన భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలి
సూర్యాపేట జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
వైద్య సేవలు, అభివృద్ధి పనులపై సమీక్ష
సూర్యాపేట, 20 జూన్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండి హాస్పిటల్ కు వచ్చే రోగులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. సూర్యాపేట జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులు, ఇన్-పేషెంట్ మరియు అవుట్-పేషెంట్ విభాగాలను ఆయన స్వయంగా పరిశీలించారు. వార్దులలోని రోగులతో కలెక్టర్ మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు..
ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్, ఆర్ఎమ్ఓ, వివిధ విభాగాల హెచ్.ఓ.డిలతో సమావేశమై, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ప్రత్యేకంగా చర్చించారు. జనవరి నెల నుండి మే నెల వరకు ఆసుపత్రికి దాదాపు 1,12,000 కంటే ఎక్కువ మంది అవుట్-పేషెంట్లకు, అలాగే 25,000 పైగా ఇన్-పేషెంట్లకు వైద్య సేవలు అందించినట్లు కలెక్టర్ తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రోగ్రాం కింద ఆసుపత్రిలో మోకాలి మార్పిడి, ఇతర ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రేడియాలజీ, గైనకాలజీ విభాగాల సేవలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ముఖ్యంగా ఇక్కడి మాత శిశు కేంద్రంలో గైనకాలజీ విభాగం ఆధ్వర్యంలో ప్రసవాల సంఖ్య పెరిగినట్లు వెల్లడించారు. ఆసుపత్రికి వచ్చే రోగులందరికీ ఉచితంగా నాణ్యమైన వైద్యంతో పాటు, మందులను కూడా అందిస్తున్నామని స్పష్టం చేశారు.
క్యాన్సర్ రోగులకు అండగా పేలియేటివ్ కేర్, కీమోథెరపీ
క్యాన్సర్ బాధితుల కోసం ఆసుపత్రిలో ప్రత్యేకంగా యూనిట్ను ఏర్పాటు చేసి, వారికి కీమోథెరపీతో పాటు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం దాదాపు 58 మంది క్యాన్సర్ రోగులు ఈ సేవల ద్వారా లబ్ధి పొందుతున్నారని ఆయన వివరించారు.
త్వరలోనే నూతన భవనాలు అందుబాటులోకి
ఆసుపత్రి ఆధునీకరణలో భాగంగా నూతనంగా నిర్మించిన మాతా శిశు సంరక్షణ బ్లాక్ భవన నిర్మాణం పూర్తయిందని, దానికి సంబంధించిన మిగిలిన ఎక్విప్మెంట్, ఇతర పనులను త్వరలోనే పూర్తి చేసి వినియోగంలోకి తెస్తామని ప్రకటించారు. అలాగే దీని పక్కనే నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నూతన ప్రధాన భవన పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయని, వీటిని వేగవంతంగా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్ ఇంజనీర్లను ఆదేశించినట్లు తెలిపారు.
ఆసుపత్రికి వచ్చే ఇన్-పేషెంట్లకు వైద్యంతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమం లో సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్, ఆర్ఎంఓ లు గీతా వాణి, ప్రశాంతి, డాక్టర్స్ మనీషా, సతీష్, ఉపేందర్ సింగ్, మునిసిపల్ కమీషనర్ హనుమంత్ రెడ్డి,మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.