అప్పులు తెచ్చి గ్రామాలు అభివృద్ధి చేసినమ్.మా పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి
మహాత్మగాంధీకి వినతిపత్రం అందజేసిన తాజా మాజీ సర్పంచులు

అప్పులు తెచ్చి గ్రామాలను అభివృద్ధి చేశామని మాకు రావాల్సిన పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని పలువురు తాజా మాజీ సర్పంచ్ లు డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ ల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. ఈ సందర్భంగా చివ్వెంల సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు జూలకంటి సుధాకర్రెడ్డి, నూతనకల్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చూడి లింగారెడ్డిలు మాట్లాడుతూ అప్పులు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేశామని అన్నారు. మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని అందోళనలు చేస్తున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదన్నారు. మాజీ సర్పంచ్ పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేసి ఆదుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం 20 ఉత్తమ గ్రామ పంచాయతీల అవార్డులు ఇస్తే అందులో 19తెలంగాణాకే రావడం మేం చేసిన అభివృద్ధికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కనువిప్పు కలిగించి మా బిల్లులు వెంటనే విడుదల చేసేలా చూడాలని మహాత్మాగాందీకి వినతిపత్రం అందించడం జరిగిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మాజీ సర్పంచ్లు గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేసిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్లు నిర్మల గోవిందరెడ్డి, దారావతు భద్రు, మానస రాము, దారావతు వెంకన్న సుజాత, పుట్ట గురువేందర్, పల్లేటి నాగయ్య, హనుమంతరావులు పాల్గొన్నారు.