భగత్ సింగ్ వంటి విప్లవ వీరుల ఆశయాలు యువతకు ప్రేరణ కావాలి
సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు పిలుపు
సూర్యాపేట, 19 మార్చి తెలంగాణవార్త ప్రతినిధి :- దేశం కోసం ప్రాణాలు అర్పించిన విప్లవ వీరుడు భగత్ సింగ్ ను నేటి యువత ఆదర్శంగా తీసుకుని గంజాయి, డ్రగ్స్ , మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా పోరాడాలని సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు అన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య (ఎఐవైఎఫ్) సూర్యాపేట పట్టణ కమిటీ మూడవ మహాసభ బుధవారం సూర్యాపేట పట్టణంలోని ధర్మభిక్షం భవన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యువజన సమాఖ్య పార్టీకి చాలా కీలకమైనదని అన్నారు. విద్యార్థి సంఘంలో చురుగ్గా పాల్గొన్న నాయకులు విద్యార్థి దశ దాటిన తర్వాత యువజన సమాఖ్యలో చేరి యువతకు మార్గదర్శకంగా నిలవాలని అన్నారు. నేటి యువత డ్రగ్స్, మత్తు పదార్థాలు, గంజాయికి బానిసలు అవుతున్నారని, యువతను సన్మార్గంలో నడిపే దిశగా విద్యార్ది సమాఖ్య పనిచేయాలని అన్నారు.
సిపిఐ పార్టీ నాయకులు బొమ్మగాని శ్రీనివాస్ మాట్లాడుతూ.... దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, అంతర్జాతీయ పరిణామాలు, రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు, మహిళల భద్రత, గ్రామీణ ప్రాంతాల్లో విద్య ఉపాధి అవకాశాలు, నిరుద్యోగ సమస్య లపై యువజన సమాఖ్య సభ్యులు అవగాహన పెంచుకోవాలని అన్నారు.
సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు చామల అశోక్ కుమార్ మాట్లాడుతూ యువజన సమాఖ్య సభ్యులు సిపిఐ పార్టి సిద్దాంతం పట్ల అవగాహనపెంచుకోవాలని, పేదల సమస్యలపై పోరాటం చేయాలని అన్నారు. పార్టి పిలుపు మేరకు కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.
ఈ సమావేశంలో అఖిల భారత యువజన సమాఖ్య పట్టణ కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యువజన సమాఖ్య గౌరవ అధ్యక్షులు గా కుక్కడం శౌరి, పట్టణ అధ్యక్షులుగా బూర సైదులు, ప్రధాన కార్యదర్శి గా ఎడెల్లి శ్రీకాంత్, కార్యవర్గ సభ్యులుగా నిమ్మల శేఖర్, అయితగాని కామేష్, ఆలగడప గోపి, కౌన్సిల్ సభ్యులు గా నిమ్మకంటి నాగరాజు, నిమ్మకంటి సతీష్, చిట్యాల గోపి, కప్పల రాము ఎన్నికైనారు. మహిళా కమిటీ సభ్యురాలు హేమలత కూడా పాల్గొన్నారు.