కష్టాలు సమస్యలు మనల రాటుతేల్చి  విజయపథం వైపు నడిపిస్తాయి అంటున్న డాక్టర్  అబ్దుల్ కలాం.

Mar 9, 2026 - 05:15
 0  1

కష్టాలు సమస్యలు మనల రాటుతేల్చి  విజయపథం వైపు నడిపిస్తాయి అంటున్న డాక్టర్  అబ్దుల్ కలాం.

 మన ప్రతిభకు మనమే మెరుగులు దిద్దుకోవడం,  సమయానుకూలంగా వ్యవహరించి  సమస్యల పరిష్కరించుకునే సత్తా సాదించుకోవడమే ప్రతిభ .

-_---- వడ్డేపల్లి మల్లేశం 


కష్టాలు, సమస్యలు,  సవాళ్లు, సందర్భాలు , సంఘర్షణలు, సందేహాలు  నిత్యజీవితంలో అడుగడుగునా దర్శనమిస్తూ ఉంటాయి . జీవన గమనాన్ని  సజావుగా కొనసాగించే క్రమములో  గత చరిత్ర నుండి  కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ప్రతి వ్యక్తికి ఉంటుంది.  అదే సందర్భంలో  జీవితంలోని పలు కోణాల గురించి అనుభవాలు జ్ఞాపకాల శీర్షికన అనేకమంది మహానుభావులు చరిత్రకారులు మేధావులు తత్వవేత్తలు వెలిబుచ్చిన అభిప్రాయాలను కూడా  గమనంలోకి తీసుకోవడం ద్వారా జీవితాలను మరింత పరిపుష్టి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది . ఈ సందర్భంలోనే భారతదేశ ప్రముఖ క్షిపణి  శాస్త్రవేత్త,  మాజీ రాష్ట్రపతి  ఏపీజే అబ్దుల్ కలాం గారు  చేసిన వ్యాఖ్యలను గమనించడం ద్వారా మన జీవితాలను మరింత దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది . కార్మికులు, కర్షకులు, చేతివృత్తుల వాళ్ళు, వ్యాపారులు , వృత్తి పనివాళ్ళు,  వీధి వ్యాపారులు,  దినసరి కూలీలు,  పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు  వంటి అనేక రంగాలలో  కొనసాగుతున్నటువంటి సమాజాన్ని పరిశీలించడం ద్వారా  రోజువారి జీవితంలో మన అవసరాలను తీర్చుకోవడానికి మన ప్రతిభను మరింత మెరుగుపరచుకోవడం ప్రతి వ్యక్తికి అవసరం.  "ఏది తనంత తానై నీ దరికి రాదు శోధించి సాధించాలి" అని అంటాడు ప్రముఖ విప్లవ కవి శ్రీశ్రీ.

అలాగే  ప్రభుత్వాలు కూడా ప్రతి అంశాన్ని అందుబాటులోకి తెచ్చే అవకాశం లేదు  కొన్ని సౌకర్యాలను డిమాండ్ చేయడం ద్వారా మరికొన్ని సౌకర్యాలను ప్రభుత్వాల యొక్క  కర్తవ్యం లో భాగంగా మాత్రమే ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి.  .మరొక అంశాన్ని ఇక్కడ ప్రస్తావించక తప్పదు.  దుక్కి దున్ని  ఒ డ్లు చెక్కి  పంటలు పండించీ తెల్లటి మెతుకులను  ప్రజల పల్లములలో పోస్తూ  ఆకలి తీర్చినటువంటి రైతన్నలు  తమ అస్తిత్వాన్ని  కోల్పోయి కూడా  సమాజం కోసం తమ వృత్తిని పవిత్రంగా భావిస్తూ  అనేక ఇబ్బందులకు గురవు ఆత్మహత్యల పాలవుతున్న విషయం మనందరికీ తెలుసు.  వ్యవసాయం లాభసాటిగా లేకపోవడం, పెట్టుబడులు పెరిగిపోవడం,  ప్రకృతి విపత్తులు, ఇతర పరిణామాల కారణంగా కూడా భారీ నష్టాలు చవిచూసినప్పుడు  రైతులు పడే ఆందోళన వర్ణనా నాతీతం . ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రతి రంగంలో పనిచేస్తున్న వాళ్ళ  బాగోగుల పట్టించుకోవాల్సిన ప్రభుత్వాలు  తమ కర్తవ్యాన్ని విస్మరించడం ఒకవైపు జరుగుతుంటే మరొకవైపు తమ గురించి నటువంటి సోయి లేకుండా  యువత ప్రజానీకం  క్లబ్బులు, పబ్బులు, ఈవెంట్లు, మద్యపానం, ధూమపానం, ఇతర అసాంఘిక అలవాట్ల బారిన చిక్కి  సమాజానికి దూరమవుతు కుటుంబాలకు భారంగా మిగిలిపోతున్నారు.

 ఈ పరిస్థితుల నుండి గట్టెక్కి సమ సమాజ స్థాపన దిశగా యువతను  ప్రజలను నడిపించడానికి  అబ్దుల్ కలాం గారు చేసినటువంటి వైయక్తిక ప్రతిభకు సంబంధించినటువంటి సూచనను  మరింతగా  ఆచరించడం ద్వారా  నూతన విలువలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుంది.  అందుకే "ప్రస్తుతం దున్నాల్సింది కేవలం  భీ డు భూములను మాత్రమే కాదు  మొ ద్దు భారిపోయి,  ఆచేతనంగా, సామాజిక బాధ్యతను విస్మరించి,  వ్యవస్థకు సైతం ద్రోహం తలపెట్టడానికి వెనుకాడనటువంటి కొంతమంది మెదల్లను  దున్నాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా వారి లోపల  గుణాత్మకమైన  విలువలను తీసుకురావడం అవసరమని"  ప్రముఖ అంబేద్కరిస్ట్ కత్తి పద్మారావు గారు  అన్న మాటలు  శిరోధార్యం .


ఏపీజే అబ్దుల్ కలాం మాటల్లో

  సమాజంలోని భిన్న వర్గాలను విశ్లేషణ చేస్తూ  మెరుగులు దిద్దుకునే సందర్భం  పురస్కరించుకొని  సమాజాన్ని ముందుకు నడిపించే క్రమంలో  ప్రతి వ్యక్తి కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అని  నొక్కి చెప్పిన తీరు వారి మాటల్లో ఒక్కసారి విందాం."  "అందరికీ ఒకే స్థాయిలో ప్రతిభ ఉండకపోవచ్చు  కానీ ప్రతిభకు మెరుగులు దిద్దుకునే అవకాశాలు మాత్రo అందరికీ సమానంగా ఉంటాయి . కష్టాలు సమస్యలే మనల్ని రాటు తేల్చి  విజయం వైపు నడిపిస్తాయి,"  అంటూ యువతను విభిన్న వర్గాల వారిని కలాం  ప్రోత్సహించిన తీరు  మానవీయ సమాజ నిర్మాణ క్రమానికి  ఎంతో దోహదపడుతుంది . ప్రతిభ సహజంగా ఏ ఒక్కరి సొత్తు కాదు,  కొన్ని కులాలకు మతాలకు కొన్ని వర్గాలకు మాత్రమే  సహజంగా ఉంటుందనుకునే భ్రమల్లో కొందరు ఉన్నారు.

కానీ అది కూడా వాస్తవం కాదు  అని చెప్పే ప్రయత్నంలో భాగంగానే  ప్రతి వ్యక్తికి సమాన స్థాయిలో ప్రతిభ ఉండకపోవచ్చు కానీ  తమకు ఎదురయ్యే సమస్యల పరిష్కరించుకోవడం కోసం  సంఘర్షణల నుండి బయటపడడానికి  చేసిన పొరపాటును సవరించుకోవడానికి  ఎవరికి వారు తమ ప్రతిభకు మెరుగులు దిద్దుకునే అవకాశాలు మాత్రం అందరికీ సమానంగా ఉంటాయి అంటారు అబ్దుల్ కలాం గారు . అవకాశాలు ఉండడం, ప్రతిభ ఉండడం వేరు  ఆ ప్రతిభను అవకాశాల మేరకు వినియోగించుకోవడం వేరు.  వినియోగించుకున్న వారు ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారు  వినియోగించుకోలేక బద్ధకంగా ఉన్నవారు ప్రతిభ సంపద అన్ని ఉండి కూడా  అచేతనంగా ఉండి పోతున్నారు. ఇటీవల కాలంలో గమనించినప్పుడు సామాన్య కుటుంబాలు పేద కుటుంబాలు  నుండి ఎదిగిన వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్ లుగా  రాణిస్తున్నటువంటి ధోరణి చూస్తే  ఆశ్చర్యం కలగక మానదు.  కనీస అవసరాలకు కూడా నోచని ఆ కుటుంబాలలో పుట్టి పెరిగిన పిల్లలు  తల్లిదండ్రుల క్రమశిక్షణ,  పిల్లల అనుకరణ,  ఇబ్బందులు కష్టాలతో సర్దుబాటు వంటి అంశాలు ప్రధానంగా చోటు చేసుకోవడం వల్లనే  ఊహించని స్థాయికి ఎదిగినటువంటి వాళ్లను గమనించినప్పుడు  నిజంగా వాళ్ళు తమ ప్రతిభకు మెరుగులు దిద్దుకున్నారని అంగీకరించవలసిందే కదా!

తపన, ఆరాటం, నిబద్ధత,  అభివృద్ధిని సవాల్గా తీసుకుని సత్తా  ఉన్నటువంటి వాళ్లు మాత్రమే ఉన్నత స్థాయికి చేరుకుంటారు. సోమరితనం ,నిర్లక్ష్యం, నిర్లీ ప్తత  ఉన్నవాళ్లు అవకాశాలుoడి, సంపదకు డోకా లేకపోయినప్పటికీ, విద్యార్హతలు బాగా ఉన్నప్పటికీ కూడా రాణించ లేకపోవడాన్ని మనం సమాజంలో అనునిత్యం గమనించవచ్చు . ఈ అంశం చూడడానికి పరిశీలించడానికి చిన్నగానే కనిపించినప్పటికీ  తమ  ప్రతిభకు మెరుగులు దిద్దుకునే అవకాశాలను వినియోగించుకోవడం ద్వారా అనేక కుటుంబాలు  ఉన్నత స్థాయికి చేరుకోవడం వాళ్ళ  కుటుంబ సభ్యులతో పాటు బంధువులు తోటి వాళ్ళు పరిసరాల్లో నివసిస్తున్న వాళ్లకు కూడా ప్రేరణగా పనిచేయడాన్ని మనం గమనించవచ్చు.  అందుకే "కష్టాలు సమస్యలు సంఘర్షణలు  జీవితంలో ఎన్ని అనుభవిస్తే  అంత చైతన్యం మనలో వస్తుందని,  సమస్యలను ఎదుర్కొనే సత్తా పరిష్కార స్పృహ  సహజంగానే అలబడుతుందని,  తద్వారా అన్ని రకాల క్లిష్ట పరిస్థితుల నుండి జీవితాన్ని  సుఖవంతం చేసుకోవడానికి  కఠిన విషయాల నుండి పరిష్కారం  చేసుకోవడానికి  మన అనుభవాలు మనకు ఉపయోగపడతాయి  అని  చేసిన రెండు వాక్యాలలో  నిండిన  వారి అనుభవ సారం  ఒక సిద్ధాంత ప్రాతిపదికగా తాత్విక చింతనగా  ఒక తరాన్ని తీర్చిదిద్దే లక్ష్యంగా  రూపుదిద్దుకున్నదనడంలో సందేహం లేదు".  ఈరోజు ప్రతి వ్యక్తి కూడా తనకంటూ ఒక  చైతన్యంతో  దూసుకు వెళ్లవలసిన అవసరాన్ని ఈ సందర్భం ఈ వ్యాఖ్య  హెచ్చరిస్తుంది  దారి చూపిస్తుంది అనడంలో సందేహం లేదు. ఇక మిగిలింది ప్రతి సామెత లేదా మహితో క్తులను  ఆచరించడం ద్వారా మన వ్యక్తిత్వాలను తీర్చిదిద్దుకోవడమే . ఉత్తమ విలువలతో కూడిన సమాజాన్ని  ఆవిష్కరించుకోవడమే .


( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడుఅరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333