న్యాయవ్యవస్థ పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం హర్షనీయం
సుధాకర్ పివిసి ఎండి,ప్రముఖ పారిశ్రామికవేత్త మీలా మహదేవ్
సూర్యాపేట,14 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త విలేఖరి:- న్యాయవ్యవస్థ గురించి ప్రజలకు అవగాహన ఏర్పరచడం తో పాటు అందులో ఉన్న లోటుపాట్లను కూడా కూలంకుశంగా వివరించడం హర్షనీయమని సుధాకర్ పివిసి మేనేజింగ్ డైరెక్టర్,ప్రముఖ పారిశ్రామికవేత్త మీలా మహదేవ్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంధాలయంలో ప్రముఖ రచయిత వై వై రెడ్డి యానాల (యానాల యాదగిరి రెడ్డి) రచించిన తొమ్మిదవ రచన న్యాయం- చట్టం- తీర్పులు - అమలు తీరు అన్న పుస్తకాన్ని ఆవిష్కరించి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. చాలా సాధారణమైన భాషలో, అందరికీ అర్థమయ్యే విధంగా రచయిత తన రచనా నైపుణ్యంతో ప్రస్తుత న్యాయవ్యవస్థలో జరుగుతున్న తీరు తెన్నులను కళ్ళకు కట్టినట్టుగా వివరించారని ప్రశంసించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు మాట్లాడుతూ పుస్తకాల చదవడం తగ్గిపోతున్న నేటి రోజుల్లో కూడా వ్యయ ప్రయాసలు తట్టుకొని తొమ్మిదవ పుస్తకం ప్రచురింపజేయడం గర్వించదగ్గ విషయం అన్నారు. ప్రతివారు పుస్తక పఠన అలవాటును పెంపొందించుకోవాలని అభిలాషించారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన సుధా బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ సాహితీ వేత్త, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీత పెద్దిరెడ్డి గణేష్ మాట్లాడుతూ యానాల యాదగిరి రెడ్డి అన్ని రచనల మాదిరిగానే న్యాయం -చట్టం -తీర్పులు -అమలు తీరు పుస్తకం కూడా మరింత ప్రజాదరణ పొందాలని ఆకాంక్షించారు. ప్రతివారు కూడా ఈ పుస్తకం చదివి న్యాయవ్యవస్థ గురించి క్షుణ్ణంగా తెలుసుకొని చైతన్యవంతులు కావాలని కోరారు. ఆత్మీయ అతిథిగా విచ్చేసి, సభ నిర్వహణ చేపట్టి,పుస్తక సమీక్ష చేసిన ప్రముఖ పాత్రికేయులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ కృష్ణ బంటు మాట్లాడుతూ న్యాయం -చట్టం- తీర్పులు అమలు- తీరు గురించి సోదాహరణగా వివరించారు. ఈ సందర్భంగా అతిథులను శాలువాలతో సన్మానించగా అనంతరం రచయిత యానాల యాదగిరి రెడ్డిని మిత్రులు, బంధువులు, అభిమానులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాన్ని జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు, వివిధ రంగాలలో నిష్ణాతులైన వారు, ఉద్యోగ విరమణ పొందిన వారు, గ్రంధాలయ అధికారులు, వివిధ పోటీ పరీక్షల సంసిద్ధత కోసం గ్రంధాలయానికి వచ్చిన యువతీ యువకులు, విద్యార్థులు,సిబ్బంది పాల్గొన్నారు.