తన శక్తి యుక్తులను మరిచి  రెడీమేడ్ అవకాశాలకు వెతికినట్లుoది  అదృష్టం  అంటాడు  భారతీయ రచయిత ఉపమన్యు చటర్జీ

Jun 12, 2026 - 21:32
 0  1

తన శక్తి యుక్తులను మరిచి  రెడీమేడ్ అవకాశాలకు వెతికినట్లుoది  అదృష్టం  అంటాడు  భారతీయ రచయిత ఉపమన్యు చటర్జీ. 

దానికి మూలం  తనలో ప్రతిభ  దాగి ఉందని  మాత్రం తెలుసుకోలేకపోవడమే  పెద్ద బలహీనత .

---వడ్డేపల్లి మల్లేశం

సంకలో పిల్లను పెట్టుకొని  ఊరంతా వెతికినట్లు అనే ఒక గ్రామీణ ప్రాంత సామెత  మన పరధ్యానాన్ని,  మన యొక్క  ఆలోచనలోని లోపాన్ని,  బాధ్యతారాహిత్యాన్ని తెలియచేస్తుంది. అలాగే సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ అవకాశాలు  జీవితంలోని  కలిసి వచ్చే సన్నివేశాల కోసం ఎదురుచూస్తూ మాట్లాడుతూ ప్రస్తావిస్తూ  అదృష్టం బాగుంటే  కలిసి వస్తుందిలే  అనే పరధ్యానంతో మన శక్తిని మనమే బలహీనపరచుకొని  అదృష్టం పైన భారం వేసి మన లక్ష్యాన్ని కుదించుకుంటూ ఉన్నాం..ఇది సర్వత్రా  కళ్ళ ముందు జరుగుతున్నటువంటి కఠోర సత్యం.  అయితే ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం అనే అంశాన్ని బట్టి  దాని యొక్క ఫలితము విజయము ఆధారపడి ఉంటుంది.  పరిశీలన, అన్వేషణ, తపన, ఆరాటము, జ్ఞాన సముపార్జన,  వెదుకులాట  వంటి అంశాల పైన మనం ఎంత  శ్రద్ధను కనపరిస్తే అంత విస్తృతమైన రీతిలో మన యొక్క ఫలితాలు శక్తులు  సామర్థ్యం  స్పష్టమవుతుంది. దీనికి బదులు మన శక్తియుక్తులను తగ్గించుకొని,  మన యొక్క విద్యార్హతలు ఆలోచన సరళిని కుదించుకొని,  అదృష్టం అనే ఒక నమ్మకం మీద  దృష్టి సారించి గాలిలో దీపం మాదిరిగా మన భవిష్యత్తు సవాల్ల ను వదిలిపెడితే  ఫలితాలు చేకూరుతాయా? సాధ్యం కాదు కదా! ఇదే సందర్భాన్ని సన్నివేశాన్ని దృష్టిలో ఉంచుకొని  భారతీయ  రచయిత ఉపమన్యు చటర్జీ చేసిన వ్యాఖ్య  మనలను మనము మరిచి, మన శక్తి యుక్తులను విస్మరించి,  అదృష్టం అనే పేరుతో  వెతుక్కుంటూ ఒకచోటి నుంచి మరొక చోటికి ప్రయాణించి అలసిపోతున్నాము ఈ ప్రయాణబడలికలో  లక్ష్యాన్ని చేరుకోలేక పోతున్నాము అనే ఆవేదన వ్యక్తం చేయడం మనందరికీ సంబంధించిన విషయం. నిజంగా శక్తియుక్తులు లేక కాదు... అవకాశాలు లేక అసలే కాదు  ...  విశ్వాసములోని లోపం  బలహీన క్షణాల వల్ల మాత్రమే మనం  అదృష్టం వెంట పరిగెడుతున్నాము అందుకే లక్ష్యాన్ని  మనం అందుకోలేక పోతున్నాము అని ఈ రచయిత హెచ్చరిస్తూ ఉంటాడు.  ఇక్కడే మనం మన యొక్క లోపాలను సవరించుకోవడం ద్వారా ఆ హెచ్చరికను పుణి కి పుచ్చుకొని  లక్ష్యాన్ని స్పష్టంగా  నిర్ధారించుకుంటే చక్కటి ఫలితాలను సాధించడం  కష్టమేమీ కాదు.

స్వాతంత్రం సాధించిన తర్వాత 1950లో  ప్రణాళిక బద్ధంగా ఈ దేశాన్ని అభివృద్ధి చేయడం కోసం  ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.  5 ఏళ్లకు ఒక్కసారి పంచవర్ష ప్రణాళిక పేరుతో లక్ష్యాలను ఆదర్శాలను అంచనాలను నిర్ధారించుకొని  అందుకు తగినటువంటి వనరులను కేటాయించి  కృషిని పురమాయించి ఫలితాలను  సాధించడం అనేది జరిగింది.  ఇటీవలి కాలంలో ప్రణాళిక సంఘం నీతి ఆయోగ్ గా మారిన తర్వాత దాని  ఆచరణలో కొంత తేడా ఉన్నప్పటికీ  లక్ష్యం మాత్రం అభివృద్ధి చెందడమే ప్రణాళిక బద్ధంగా  ముందుకు వెళ్లడమే.  మరి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లడానికి మనం అదృష్టం వెంట పరిగెడితే  సాధ్యమవుతుందా? అని మనం ప్రశ్నించుకుంటేనే తగిన సమాధానం దొరుకుతుంది. లేదా మన లోపాలను సవరించుకోవడానికి అవకాశం  అందుతుంది.

కార్యకారణ సంబంధాన్ని  లోతుగా అన్వేషించాలి.

 ప్రతి సంఘటనకు మూలం, ప్రతి కార్యానికి కారణం,  ప్రతి చర్యకు దాదాపుగా ప్రతి చర్య ఏదో రకంగా ఉంటూనే ఉంటుంది.  ఈ రకమైనటువంటి సంబంధాలను తెలుసుకోకుండా  వాటి ఫలితాలను అంచనా వేయకుండా  నూతన విషయాలను ఆశించడం అత్యాశ అవుతుంది. అయితే మన అంచనా  మన లక్ష్యం భారీగా ఉన్నప్పుడు  అత్యున్నత స్థాయి అవకాశాలను కూడా అందుకోవడానికి వెనకాడ వలసిన పని లేదు అది మన  సామర్థ్యం, సత్తా,  సవాల్ లాంటిది.  ఇక్కడే  దాని అడ్రస్ వెతుక్కునే క్రమంలో  మనం తప్పట అడుగులు వేస్తున్నాం.  ఇదే సందర్భంలో  డాక్టర్  సర్వేపల్లి రాధాకృష్ణ  రవీంద్ర ఠాగూర్లు అన్నటువంటి మాటలను మనం మననం చేసుకోవడం చాలా అవసరం.  విజ్ఞాన సము పా ర్జన చేసే క్రమంలో  మనకు ఎంత తెలిసినప్పటికీ  మరింత నేర్చుకోవాలని తపన, తనకు ప్రాథమిక పరిజ్ఞానం కూడా లేదు  అనే ఆలోచన, ఆత్రుత ఉన్నట్లయితే  లోతైనటువంటి విజ్ఞానాన్ని  సంపాదించే అవకాశం ఉంటుంది.  ఒకవేళ పొరపాటున అన్నీ తెలుసని అనుకుంటే  గురువు చెప్పే విషయాన్ని లేదా వక్తలు మాట్లాడే అంశాలను  మనసులో పెట్టక పోతే  మన అహంకారం మనల్ని దెబ్బతీస్తుందని దీని అర్థం.  ఇక పరీక్షలు రాసే సమయంలో మాత్రం  ఆత్మస్థైర్యంతోని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని పరీక్షకు సంబంధించినటువంటి  సమగ్ర విషయం అంతా కూడా తనకు బాగా తెలుసునని,  ఆత్మస్థైర్యాన్ని ముందుగా అలవరచుకుంటే కొంతవరకైనా  ప్రకటించడానికి  పరీక్షల్లో రాయడానికి  మనసు ఆరాటపడుతుంది కనుక  విజయం ఎంతో కొంత వరించే అవకాశం ఉంటుంది.  అయితే ఇవి కొంత వరకు ఎత్తుగడలు మాత్రమే.  ఎత్తుగడలు,  ప్రణాళిక అబద్ధమైన కృషి,  ఊహ  భుజానికి ఎత్తుకొని  నియమబద్ధంగా కృషి చేస్తే సాధించే ఫలితం  మనకు అనుకూలంగా ఉంటుంది.  

అలాంటి దానినే అప్పుడప్పుడు  ఆత్మ తృప్తి కోసం బలహీనతను బయట పెట్టుకోవడం కోసం మనం అదృష్టం అనే పేరుతో వాడుతూ ఉంటామని  విశ్లేషకులు మేధావులు మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  కృషి లేకుండా, ఆలోచించకుండా, ప్రణాళిక లేకుండా  లక్ష్యాన్ని చేరుకోలే0 కదా!  అందుకే వీటన్నింటి యొక్క సమాహారం మన లక్ష సాధన అని  గుర్తించి  ఫలితాన్ని సాధించడం కోసం ఏ రకంగా ప్రయాణం చేయాలో  గమనాన్ని గమ్యాన్ని నిర్దేశించుకోవాల్సింది మనమే.  ఈ క్రమంలో తొందరపాటులో,  అదృష్టం అనే భ్రమలో,  వెతుక్కుంటూ తప్పటడుగులు వేస్తూ గందరగోలానికి  గురి అయితే  ఫలితం జీరో అని చెప్పడమే ఈ రచయిత యొక్క ఉద్దేశం.  మన శక్తిని అంచనా వేయకుండా,  మన ప్రణాళికాబద్ధమైన కృషిని ఆలోచించకుండా,    అహర్నిశలు చేసిన కృషిని  ఆమోదించకుండా  ఏదో తాత్కాలికంగా ఎవరో ఇచ్చిన సలహా వళ్ళనే తన విజయం  చేకూరిందని   నమ్మే గుడ్డి నమ్మకమే వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని శక్తిని దెబ్బతీస్తుంది. తన ప్రతిభను, శక్తిని, మూర్తిమత్వ వికాసాన్ని,  ప్రణాళిక బద్ధమైన కృషిని ప్రతి వ్యక్తి కూడా అంగీకరించి తీరాలి ఆమోదించాలి.  తన ప్రతి అడుగులోనూ ఈ దశలు ఉంటాయని గుర్తిస్తే  కొంత వెనక  ముందు అయినా  కొంత అటు ఇటుగానైనా వ్యక్తులు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది." అనగననగరాగ మతిశ ఇల్లుచునుండు తినగా తినగా వేము తీయనుండు" అనే వేమన పద్యాన్ని ఒక్కసారి  పరిశీలిస్తే  మనిషి యొక్క కృషిని ఆరాటాన్ని  సాధనను  తపనలోని  పోరాటపటి మను అంచనా వేయవచ్చు.  భౌతికమైనటువంటి విషయాలను పక్కనపెట్టి  అమూర్త భావనలకు అవకాశం ఇస్తే  మన కృషిని మనమే  నిందించుకున్నట్లు.  మనం చేసిన  ప్రణాళికా బద్ధమైన కృషి ఏటిలో పిసికిన చింతపండు అయిపోయినట్లు అని అర్థం చేసుకోవాలి.  ఏ ఇతర ప్రాణికోటికి లేనటువంటి వివేచన, ఆలోచన, మే దో సంపత్తి  మనకు ఉన్నాయి కనుక  వాటిని సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా  మానవ జీవిత  పరమార్థాన్ని  అసాధ్యమైన విషయాలను సాధ్యం చేసే స్థాయిని  నిజం చేయడానికి అవకాశం ఉంటుంది. అనేకమంది శాస్త్రవేత్తలు మేధావులు, తత్వవేత్తలు,  న్యాయ కోవిదులు,  ఆరోగ్య నిపుణులు, విద్యావేత్తలు  తమ ఊహకు మరింత పదును పెట్టడం వల్లనే  కొత్త మందులను, చట్టాలను, జ్ఞానాన్ని, శాస్త్రాన్ని, పరిష్కారాలను, విశ్లేషణను,  అన్వేషణను,  అంతి మంగా  కొత్త సూత్రాలను,  వస్తువులను,  పదార్థాలను, లక్షణాలను కనిపెట్టడానికి అవకాశం ఏర్పడింది.  ఇది అంతా మనిషి ఒక ప్రణాళిక బద్ధంగా  జరిపిన కృషి వల్లనే సాధ్యమైంది కానీ  అదృష్టాన్ని నమ్ముకొని  అంచనా లేకుండా  లక్ష్యాన్ని నిర్ధారించుకోకుండా సాధ్యమైన పనులు కావివి.

"మానవుడే మహనీయుడు  శక్తి యుతు డు యుక్తిపరుడు  మానవుడే మాననీ యు డు" అంటూ ఆరుద్ర రాసిన పాటలో  సృష్టికి ప్రతి సృష్టిని మనిషి ఎలా నిర్మించగలిగాడు? అసాధ్యమైన పనులను ఎలా సాధ్యం చేశాడు? నూతన పరికల్పనలకు ఎలా జీవం పోశాడు?  అన్న కఠోర వాస్తవాలను  కళ్ళ ముందు సాక్షాత్కరింప చేసిన విషయం మనకు తెలుసు.  అయినా మనిషి తన శక్తిని మరిచి  తన మీద తనకు అనుమానం  పె నవేసుకోగా  అదృష్టాన్ని నమ్ముకొని  పతనానికి చేరుకుంటున్నాడు అంటే  నిజంగా అది మానవ బలహీనత, తప్పిదము, అనాలోచిత చర్య,  అంతకుమించి పరాన్న జీవి బతుకు,  బానిస మనస్తత్వం అనడంలో అతిశయోక్తి లేదేమో!  ప్రతి విషయంలోనూ సవాలు విసిరి,  ప్రతి సమస్యకు పరిష్కారాన్ని  కనుగొనే రీతిలో ఆలోచించి,  మే దో మదనంతో  సృష్టికి మరో సృష్టి చేయగలిగే స్థితిలో ఉన్న మనం  భవిష్యత్తులో మరిన్ని కొత్త నూతన ఆవిష్కరణలకు జీవం పోయగలమని,  అసాధ్యం ఏదీ లేదని, రుజువు చేయగలిగే స్థితిలో ఉండి  తలవంచితే మాత్రం  విజయం చేకూరదు. బలహీనత వైపు మొగ్గుచూపితే  అన్ని అపశకునాలే జాగ్రత్త!

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ  )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333