జోగుళాంబ గద్వాల్ ఆర్ముడ్ రిజర్వ్ పోలీసులతో పోలీస్ దర్బార్
➤ పోలీస్ సిబ్బంది సంక్షేమమే ప్రాధాన్యం- జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్.,
జోగులాంబ గద్వాల 11 మార్చి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల. బుధవారం జోగుళాంబ గద్వాల్ జిల్లా ఎస్పీ కార్యాలయంలోని గ్రీవెన్స్ హాల్లో ఆర్ముడ్ రిజర్వ్ (AR) పోలీసు సిబ్బందితో జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్ పోలీస్ దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తమ సేవలకు సంబంధించిన సమస్యలు, వీక్లీ ఆఫ్, పెండింగ్ బిల్లులు తదితర అంశాలపై సూచనలు, సమస్యలను ఎస్పీ కి వివరించారు. రోజువారీ విధి నిర్వహణకు సంబంధించిన అంశాలను ఎస్పీ స్వయంగా విని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు శాఖలో ఆర్ముడ్ రిజర్వ్ సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ, బందోబస్తు విధులు, ప్రత్యేక ఆపరేషన్లు, పండుగలు మరియు ఎన్నికల సమయంలో వీరి సేవలు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి పోలీసు సిబ్బంది క్రమశిక్షణతో, నిబద్ధతతో విధులు నిర్వర్తించి పోలీసు శాఖ ప్రతిష్టను మరింత పెంచాలని సూచించారు.
సిబ్బంది సంక్షేమం పట్ల జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, విధుల్లో ఎదురయ్యే ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, వసతి, డ్యూటీ సమయాల వంటి అంశాలను అధికారులకు నేరుగా తెలియజేయాలని ఎస్పీ తెలిపారు. సమస్యలు పెండింగ్లో ఉండకుండా దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అలాగే ప్రతి ఒక్కరూ శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవాలని, రోజువారీ వ్యాయామం చేయాలని సూచించారు. ఒత్తిడిని అధిగమించేందుకు మానసిక స్థైర్యం పెంపొందించుకోవాలని, తమ తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులను బాగా చూసుకోవాలని తెలిపారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం ద్వారా పోలీసు శాఖపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు. క్రమశిక్షణ, సమయపాలన, విధి పట్ల నిబద్ధత ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అని స్పష్టం చేశారు.
ఈ పోలీస్ దర్బార్ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ కే. శంకర్, ఆర్ముడ్ రిజర్వ్ డీఎస్పీ టి. నరేందర్ రావు, ఆర్ఐలు నరేష్, వెంకట్, హరీఫ్, ఆర్ఎస్ఐలు చంద్రకాంత్, బాలచంద్రుడు తదితర ఆర్ముడ్ రిజర్వ్ పోలీసులు పాల్గొన్నారు.