ప్రభుత్వ లక్ష్యాలు పూర్తికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలి
పోడు భూముల పట్టా పాస్ పుస్తకాల ముద్రించి పంపిణీ సన్నద్దం కావాలి .
జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యాల సాధనకు కృషి చేయాలి.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి.
సూర్యాపేట:- ప్రభుత్వ లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు.
శుక్రవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మునిసిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు, పట్టణ ప్రాంతాలలో రెండు పడక గదుల నిర్మాణం, 58, 59, 76 ప్రభుత్వ జి.ఓ. ల ప్రకారం చేయవలసిన క్రమబద్దీకరణ, పోడు భూములు, ఆయిల్ పామ్ సాగుపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పట్టాలు లేకుండా ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములు, ఆబాది గ్రామకంఠం, శిఖం, వక్ఫ్, దేవాదాయ భూముల మొదలగు వివరాలను ప్రోఫార్మా 1 ప్రకారం సేకరించామని, సదరు భూమి క్రమబద్ధీకరణ చెసేందుకు గల అవకాశం, ప్రతిపాదిక, అనుసరించాల్సిన విధానం పై నివేదిక తయారు చేయాలని కలెక్టర్ లకు సూచించారు.
ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 58 ,59 ప్రకారం ప్రభుత్వ భూములు, గ్రామ కంఠం, ఆబాది మొదలగు కారణాల వల్ల హోల్డ్ లో పెట్టిన దరఖాస్తులు మరో సారి పరిశీలించాలని, ప్రోఫార్మా 1 ప్రకారం సేకరించిన సమాచారం, సదరు దరఖాస్తులను సరిచూసుకోని నిర్ణయం తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు అధికారులను సీఎస్ అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 25 పనిదినాలలో 51.87 లక్షల మంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించామని, జిల్లాలకు చేరే ప్రిస్కైబ్డ్ కళ్ళద్దాల పంపిణీని పూర్తి చేసి వివరాలు ఆన్ లైన్ లో వెంటనే నమోదు చేయాలన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన క్వాలిటీ కంట్రోల్ బృందాలు విస్తృతంగా పర్యటించి కంటి వెలుగు శిబిరాలలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, వేసవి దృష్ట్యా క్యాంపుల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ సూచించారు. జిల్లాలో కంటి వెలుగు అమలు సంబంధించి కలెక్టర్ ల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.
రాష్ట్రంలో జీహెచ్ఎంసీ మినహాయించి పట్టణాలలో నిర్మాణం పూర్తి చేసిన డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం లబ్ధిదారుల ఎంపిక చేయాల్సి ఉందని, జిల్లా కలెక్టర్ లు ప్రత్యేక చోరవ తీసుకొని త్వరితగతిన లబ్దిదారుల ఎంపిక చేసి వివరాలు ఆన్ లైన్ లో అప్ లోడ్ ప్రక్రియను మరో వారం, పది రోజుల్లో పూర్తి చేయాలని అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 58 ప్రకారం అర్హత సాధించిన దరఖాస్తులు పట్టా సర్టిఫికెట్ లు సిద్దం చేసామని, స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులు సమయం తీసుకోని వెంటనే పంపిణి పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. ప్రభుత్వ ఉత్తర్వు 59 ప్రకారం పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలని అన్నారు.
అర్హులుగా గుర్తించిన దరఖాస్తుదారుల నుంచి క్రమబద్దికరణ రుసుము విడతల వారిగా వసూలు చేయాలని, మొదటి విడత సేకరణ కు చర్యలు తీసుకోవాలని రుసుము పూర్తి స్థాయిలో చెల్లించిన దరఖాస్తులు, పట్టాలను స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో పంపిణీ చేయాలన్నారు. జీఓ 59 కు సంబంధించి రుసుము 3 విడతలు ఒకేసారి చెల్లిస్తే 5% డిస్కౌంట్ ఉంటుందని, మార్చి చివరి నాటికి పూర్తి స్థాయిలో చెల్లింపులు సేకరించి పట్టాల పంపిణీ పూర్తి కావాలన్నారు.
ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 76 కింద అధికారులు పెండింగ్ దరఖాస్తుల స్క్రూటినీ 3 రోజుల్లో పూర్తి చేయాలని, త్వరితగతిన రుసుము వసూలు చేసి మార్చి 20 నాటికి పట్టాల పంపిణీ పూర్తి చేయాలని సీఎస్ అన్నారు. పోడు భూముల పంపిణీ సంబంధించి జిల్లా స్థాయి కమిటీ వద్ద పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, జిల్లాలో ఆమోదించిన పోడు పట్టా వివరాలను డౌన్ లోడ్ చేసి ఒకసారి చూసుకోని పట్టా పాస్ పుస్తకాలు ముద్రణ చేయాలని సూచించారు.
ఆయిల్ పామ్ సాగు కింద ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలను మార్చిలోగా పూర్తి చేయాలని, జిల్లాలో ఎంపిక చేసిన భూములలో వెంటనే ఆయిల్ పామ్ మొక్కలు నాటాలని, సంబంధిత భూముల డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని అన్నారు. తెలంగాణ కు హరితహారం క్రింద వచ్చే సీజన్ లో నాటే మొక్కలు స్థానికంగా నర్సరీ నుంచి సిద్దం చేసుకోవాలని, దీనికి సంబంధించి అవసరమైన కార్యాచరణ అమలు చేయాలని సీఎస్ అన్నారు.
ఈ కాన్ఫెరెన్స్ లో జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్, అదనపు కలెక్టర్లు పాటిల్ హేమంత కేశవ్, dfo సతీష్, ఆర్.డి.ఓ లు కోదాడ కిషోర్ కుమార్, హుజూర్ నగర్ వెంకా రెడ్డి dmho Dr. కోటా చలం, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు రామారావు నాయక్, శ్రీధర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.