నగ్న ఫొటో షూట్ ఎఫెక్ట్.. రణ్వీర్ సింగ్పై ఎఫ్ఐఆర్ నమోదు
ముంబైలోని చెంబూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన లాయర్

మహిళల మనోభావాలు తెబ్బతీశారని ఆరోపణ
నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు
బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ చిక్కుల్లో పడ్డాడు. నగ్న ఫొటో షూట్ తో అందరినీ ఆశ్చర్యపరిచిన రణ్ వీర్ ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్నాడు. గతంలో మహిళలు మాత్రమే ఇలాంటి ఫొటో షూట్లు చేయగా.. భారత్ లో తొలిసారి ఓ పురుషుడు, అది కూడా ఓ స్టార్ హీరో చేసిన ఈ ఫొటో షూట్ చర్చనీయాంశమైంది. రణ్ వీర్ ధైర్యాన్ని అభిమానులు మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం తమ మనోభావాలను దెబ్బతీశాడంటూ అతనిపై విమర్శలు చేస్తున్నారు.
ఈ క్రమంలో తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో నగ్నచిత్రాలను పోస్ట్ చేసినందుకు రణ్ వీర్ సింగ్పై ముంబైలోని చెంబూరు పోలీసులు కేసు నమోదు చేశారు. రణ్ వీర్ పై అశ్లీలత, అసభ్యతకు సంబంధించి 292, 293, 509 సెక్షన్లతో పాటు ఐటీ చట్టంలోని 67 (A) సెక్షన్ కింద ముంబైకి చెందిన న్యాయవాది వేదిక చౌబే ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తన ఫొటోల ద్వారా రణ్ వీర్ మహిళల మనోభావాలను దెబ్బతీశారని, వారి నిరాడంబరతను అవమానించారని చౌబే తన ఫిర్యాదులో ఆరోపించారు.
ముంబైకి చెందిన ఓ ఎన్జీవో కూడా బాలీవుడ్ నటుడిపై ఇదే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తాము సమాజ అభివృద్ధికి ముఖ్యంగా చిన్నారులు, వితంతువుల విద్య కోసం పనిచేస్తున్నామని పేర్కొంది. మన దేశంలో ప్రజలు దేవుళ్లుగా కూడా ఆరాధిస్తుంటారని తెలిపింది. కానీ, రణ్వీర్సింగ్ వంటి నటులు ఇలాంటి పనులతో ప్రజల మనోభావాలను పణంగా పెట్టి చీప్ పబ్లిసిటీని పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది.